ప్లేట్ మార్చిన రాయ‌పాటి.. వ్యూహం ఫ‌లించేనా?

రాజ‌కీయ దురంధ‌రుడు.. దేశ‌రాజ‌కీయాల్లో దాదాపు మూడు త‌రాల‌ను చూసిన నేత‌.. గుంటూరుకు చెందిన రాయ‌పాటి సాంబ‌శివ‌రావు. పారిశ్రామిక వేత్త నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చి.. ఇందిర‌, రాజీవ్‌, సోనియాల ఆధ్వ‌ర్యంలో కాంగ్రెస్‌లో ప‌నిచేసిన రాయ‌పాటి.. సుదీర్ఘ కాలం పార్లమెంటు స‌భ్యుడిగా కొన‌సాగారు. ఇందిర‌మ్మ స‌హా సోనియా వ‌ద్ద నుంచి అడ‌గ‌గానే అప్పాయింట్‌మెంట్ తెచ్చుకోగ‌లిగిన నాయ‌కుడిగా రాయ‌పాటికి పేరుంది. అలాంటి నాయ‌కుడు.. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్ర‌బాబును త‌న దారిలోకి తెచ్చుకునేందుకు ఆప‌శోపాలు ప‌డుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

వ్యాపారాల్లో అయినా.. రాజ‌కీయాల్లో అయినా.. వార‌సుల‌కే ప్ర‌థ‌మ తాంబూలం.. అందిస్తున్న రోజులు. రాజ‌కీయాల్లో వార‌స‌త్వం ఏంటి? అనే నాయ‌కులు పోయి.. రాజ‌కీయాలు ఉన్న‌దే వార‌స‌త్వం కోసం క‌దా.. అనే రోజులు ఇవి! ఈ క్ర‌మంలోనే రాయ‌పాటి కూడా త‌న కుమారుడు రంగారావు కోసం అనేక ప్ర‌య‌త్నా లు చేస్తున్నారు. కాంగ్రెస్ బ‌తికి బావుంటే.. ఈ పాటికి ఆయ‌న కుమారుడికి మంచి పొజిష‌నే ద‌క్కి ఉండేది. కానీ, విభ‌జ‌న‌తో కాంగ్రెస్ తెర‌మ‌రుగు కావ‌డం, టీడీపీలోకి వ‌చ్చి చేర‌డంతో రాయ‌పాటి అనుకున్న విధంగా ఇక్క‌డ రాజ‌కీయాలు సాగ‌డం లేదు. దీంతో ఆయ‌న వార‌సుడిపై పెట్టుకున్న ఆశ‌లు ఎప్ప‌టికి నెర‌వేర‌తా యో.. అనే సందేహాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి.

రాయ‌పాటి రంగారావును ఎమ్మెల్యేగా చూసుకోవాల‌నేది సాంబ‌శివ‌రావు ముచ్చ‌ట‌. ఈ క్ర‌మంలోనే గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయించాల‌ని అనుకున్నారు. కానీ, ఇక్క‌డ కోడెల శివ‌ప్ర‌సాద్‌ను తీసి ప‌క్క‌న పెట్టే ప‌రిస్థితి బాబుకు లేదు. పోనీ.. ఆయ‌న హ‌ఠాన్మ‌ర‌ణం త‌ర్వాత అయినా.. త‌న కుమారుడికి ఇవ్వాల‌ని రాయ‌పాటి ఒత్తిడి పెంచారు. లేదంటే పార్టీ మార‌తాన‌ని కూడా లీకులు ఇచ్చారు. అయినా బాబు ప‌ట్టించుకోలేదు. దీనికీ కార‌ణం ఉంది.. కోడెల మ‌ర‌ణంతో ఆయ‌న కుమారుడు శివ‌రామ‌కృష్ణ‌కు అవ‌కాశం ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంది. దీంతో స‌త్తెన‌ప‌ల్లికి ఆయ‌న‌కే రిజ‌ర్వ్ చేశారు.

దీంతో రాయ‌పాటి విజ్ఞ‌ప్తిపై స్పందించ‌లేదు. దీంతో ఇన్నాళ్లు వేచి ఉన్న సాంబ‌శివ‌రావు.. తాజాగా ప్లేట్ ఫిరాయించారు. స‌రే! మాకు స‌త్తెన‌ప‌ల్లి వ‌ద్దులే. పెద్ద‌కూర‌పాడు ఇవ్వండి. ఇది మా సొంత ఊరు. ఇక్క‌డ మా అబ్బాయిని గెలిపించుకుని తీర‌తాను! అని ఆయ‌న బాబుకు విజ్ఞ‌ప్తి చేస్తున్నార‌ట‌. మ‌రి ఇక్క‌డ టీడీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన కొమ్మాల‌పాటి శ్రీధ‌ర్ ఉన్నాడు క‌దా?! అంటే.. ఆయ‌న ఇక్క‌డ ఉండ‌డం లేద‌ని, గుంటూరు న‌గ‌రంలోని ఓ నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టి పెట్టార‌ని.. ఆయ‌న అక్క‌డికే వెళ్లిపోవ‌డం ఖాయ‌మ‌ని.. రాయ‌పాటి చెబుతున్నార‌ట‌. దీంతో టీడీపీలో ఈ చ‌ర్చ ఆస‌క్తిక‌రంగా మారుతోంది. రాయ‌పాటి నియోజ‌క‌వ‌ర్గాల‌ను మార్చినా.. బాబు మ‌న‌సును మాత్రం మార్చలేక పోతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. మ‌రి ఇప్ప‌టికైనా రాయ‌పాటి రంగారావుకు బెర్త్ దొరుకుతుందో లేదో చూడాలి.