లోకేశ్ ‘మంత్రం’ మాయ చేస్తోంది!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ రాష్ట్ర యువత భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దే దిశగా దూకుడుగా సాగుతున్నారు. మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత లోకేశ్ అగ్రరాజ్యం అమెరికాలో ఓ 10 రోజుల పాటు పర్యటించారు. ఈ సందర్భంగా వరల్డ్ టాప్ కంపెనీల కార్యాలయాలను చుట్టేసిన లోకేశ్… ఎక్కడికెళ్లినా.. ఆయా కంపెనీలు, వాటి యాజమాన్యాలకు ఒకే మాట చెప్పారు. అదేంటంటే… ఏపీలో మానవ వనరులు కొరతన్నదే లేదని ఆయన అందరికీ పదే పదే చెప్పారు. ఈ మాట దాదాపుగా అన్ని కంపెనీలను ఆలోచనలో పడేసింది. ఏపీ వైపు చూసేలా చేసింది.

ఏపీలో అపారంగా ఉన్న ఆ మానవ వనరులకు ఇప్పుడు లోకేశ్ మరింత నైపుణ్యాలను జత చేస్తున్నారు. ఈ దిశగా లోకేశ్ చేస్తున్న కృషికి ఇప్పుడు మంచి ఫలితం దక్కింది. టెక్నాలజీలో ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీగా వెలగొంతుతున్న మైక్రోసాఫ్ట్ గురువారం ఏపీ ప్రభుత్వంతో ఓ కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఏపీ యువతకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణతో రాష్ట్ర యువతలో సాంకేతిక నైపుణ్యం మరింతగా ఇనుమడించనుంది. ఫలితంగా ఆయా రంగాల్లో వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు అంది రానున్నాయి.

మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రతినిధులు గురువారం అమరావతికి వచ్చి… ఏపీ ఐటీ శాఖ మంత్రి హోదాలో నారా లోకేశ్ తో భేటీ అయ్యారు. అనంతరం ఆ శాఖ అదికారులతో రాష్ట్ర యువతకు ఏఐ, అడ్వాన్స్ డ్ టెక్నాలజీల్లో శిక్షణ ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రానికి చెందిన 2 లక్షల మందికి మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇవ్వనుంది. మైక్రోసాఫ్ట్ శిక్షణ తీసుకుంటే… ఆ 2 లక్షల మందికి ఐటీ కొలువులు ఖాయమే కదా. వెరసి కూటమి కొలువుల లక్ష్యం 20 లక్షల ఉద్యోగాల్లో ఈ ఒక్క ఒప్పందంతోనే 10 శాతం మేర కొలువులు వచ్చేసినట్టే కదా. అంటే…లోకేశ్ మంత్రం నిజంగానే మాయ చేస్తున్నట్లే కదా.