లులూ తిరిగొచ్చింది!… కొత్తగా దాల్మియా వచ్చింది!

కూటమి పాలనలో ఏపీ పారిశ్రామికంగా పరుగులు పెడుతోంది. కూటమి పాలన మొదలైన తొలి 9 నెలల్లోనే దాదాపుగా రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదరగా… వాటి ద్వారా దాదాపుగా రాష్ట్ర యువతకు 4 లక్షల మేర ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. తాజాగా గురువారం జరిగిన నాలుగో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశం మరిన్ని పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కొత్త పెట్టుబడుల్లో ఏపీ నుంచి వైసీపీ దెబ్డకు పారిపోయిన లులూ గ్రూప్ తిరిగి ఏపీలోకి ప్రవేశించనుంది. అదే సమయంలో కొత్తగా సిమెంట్ రంగంలో దేశంలోనే పేరెన్నికగన్న కంపెనీగా గుర్తింపు పొందిన దాల్మియా కంపెనీ రాష్ట్రంలోకి అడుగుపెడుతోంది.

ఏపీ రాజధాని అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన నాలుగో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా రూ.1,21,659  కోట్ల మేర పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడులతో రాష్ట్రంలోకి మొత్తంగా 10 ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్ర యువతకు 80,104 ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. వీటితో పాటుగా రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని తీర్మానించారు.

ఇక రాష్ట్ర యువతకు వివిద రంగాల్లో శిక్షణ ఇవ్వడంతో పాటుగా ఉపాధి అవకాశాలను మెరుగుపరచేందుకు ఉద్దేశించిన రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాల ఏర్పాటుకు కూదా ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేవలం నెల వ్యవధిలోనే రాష్ట్రంలో 5 రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని చంద్రబాబు తీర్మానించారు. ఫలితంగా నిరుద్యోగ యువతకు ఆయా రంగాల్లో శిక్షణలతో పాటుగా ఉపాధి అవకాశాలు మెరుగు కానున్నాయి. ఇక విశాఖలో భారీ షాపింగ్ మాల్ ను ఏర్పాటు చేసేందుకు లులూ గ్రూప్ రూ.1,500 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. అదే సమయంలో కడప జిల్లాలో దాల్మియా స్టీల్స్ కంపెనీ ఓ బారీ సిమెంట్ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనుంది.