లోకేశ్ జోరు.. వైసీపీ కంగారు

టీడీపీ యువ నేత నారా లోకేశ్ ఒక్కసారిగా జోరు పెంచడంతో వైసీపీలో కంగారు మొదలైంది. ఆ పార్టీలో నంబర్ 2గా చెప్పుకొనే విజయసాయిరెడ్డి చేస్తున్న వరుస ట్వీట్లు, ఫేస్ బుక్ పోస్టులు చూస్తుంటే వైసీపీ ఏ స్థాయిలో కంగారుపడుతోందో అర్థమవుతోంది. వరదలో చిక్కుకున్న ప్రాంతాలను వైసీపీ నేతలు ఎంతవరకు సందర్శించారో ఏమో కానీ లోకేశ్ మాత్రం వరద బాధిత ప్రాంతాల్లో తెగ తిరుగుతున్నారు. నడుం లోతు నీళ్లలో దిగి మరీ ఆయన వెళ్లడం ఇప్పటికే రాష్ట్రమంతా చూసింది. తాజాగా ఆయన ట్రాక్టర్ నడుపుతూ వెళ్లారు.. ఆ క్రమంలో భారీ ప్రమాదం నుంచి కూడా బయటపడ్డారు.

అయితే.. లోకేశ్ ఇలా వరద పీడిత ప్రాంతాల్లో చురుగ్గా తిరుగుతుండడంతో వైసీపీ కంగారు పడుతోంది. తాము చేయలేని, చేయని పనిని లోకేశ్ చేస్తుండడంతో వైసీపీలో కాక మొదలైంది. ట్రాక్టరే నడపలేని లోకేశ్ పార్టీనేం నడుపుతారు అంటూ విజయసాయిరెడ్డి ఫేస్ బుక్‌లో పోస్టులు పెట్టారు. నువ్వెక్కడం వల్లే ట్రాక్టరు గుంతలో పడిందంటూ లోకేశ్ లావుగా ఉంటారన్న అర్థంలో బాడీ షేమింగ్ చేస్తూ ట్వీట్లు చేశారు. అయితే, ఇవన్నీ వైసీపీ మూఢ భక్తులకు నచ్చాయేమో కానీ రాష్ట్ర ప్రజలకు మాత్రం పెద్దగా ఎక్కలేదు.

సాధారణ తుపాను వల్ల వచ్చిన అధిక వర్షాలనే సమర్థంగా డీల్ చేయలేకపోయిన వైసీపీ ప్రభుత్వం హుద్‌హుద్, తిత్లి, ఫొని వంటి సూపర్ సైక్లోన్లు వస్తే ఏం చేస్తుందని ప్రజలు అంటున్నారు. హుద్ హుద్, తిత్లి సమయాలలో చంద్రబాబు స్పందించిన తీరు.. ప్రభుత్వం మొత్తాన్ని తుపాను ప్రభావిత ప్రాంతాలకు తీసుకొచ్చి అక్కడే ఉంటూ సహాయ చర్యలు చేపట్టిన తీరును గుర్తు తెచ్చుకుంటున్నారు. మాటలు, ట్వీటులు కాకుండా చేతల్లో పని కనిపించాలని.. అది చంద్రబాబుకు తప్ప ఈ వైసీపీ ప్రభుత్వానికి సాధ్యం కాదని విజయసాయిరెడ్డి పోస్టుల కిందే కామెంట్లు పెడుతున్నారు.