లోకేశ్ మాటిచ్చారంటే.. ఇలాగే ఉంటుంది

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ ఒక్కసారి మాటిచ్చారా? ఇక ఆ పని అయిపోయినట్టే. వాయిదా ఉండదు. జాప్యం అసలే ఉండదు. యుద్ధ ప్రాతిపదికన అంటాం కదా.. అలా గంటల వ్యవధిలోనే సదరు పనిని పూర్తి చేసే కార్యాచరణ ప్రారంభమైపోతుంది. అంతేనా… సదరు పని లోకేశ్ నిర్దేశించిన సమయంలోగానే పూర్తి అయి తీరుతుంది. అలా ఎందుకు అవుతుందంటే.. దానిపై లోకేశ్ అనుక్షణం ఓ కన్నేసి ఉంచుతారు కాబట్టి. నిజమే… అటవీ శాఖాధికారులు కూల్చేసిన కాశినాయన ఆశ్రమ పునర్ నిర్మాణ పనులను చూస్తే ఈ మాట నిజమేనని చెప్పక తప్పుదు.

కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం పరిధిలోని నల్లమల అడవుల్లో కొనసాగుతున్న శ్రీ కాశినాయన అన్నదాన సత్రం కూల్చివేతపై లోకేశ్ వేగంగా స్పందించిన సంగతి తెలిసిందే. అటవీ శాఖ అధికారులు చేసిన పొరపాటుకు లోకేశ్ క్షమాపణలు చెప్పారు. అంతేనా… కాశినాయన ఆశ్రమాన్ని తన సొంత నిధులతో పునర్ నిర్మాస్తానని కూడా బుధవారం హామీ ఇచ్చారు. టైగర్ రిజర్వ్ జోన్ లో ఉందంటూ ఆ ఆశ్రమంలోని కొన్ని భవనాలను అటవీ శాఖ అధికారులు తొలగించారు. అయితే వేలాది మందికి నిత్యం అన్నదానం చేస్తున్న సదరు సత్రాన్ని తొలగించే దిశగా కుట్ర జరుగుతోందన్న ప్రచారంపై లోకేశ్ వేగంగా స్పందించి… పరిస్థితిని చక్కదిద్దారు.

సత్రంలో అటవీ శాఖ అధికారులు కూల్చేసిన భవనాలను తన సొంత నిధులతో నిర్మించి ఇస్తానని బుధవారం ప్రకటించిన లోకేశ్… వెనువెంటనే రంగంలోెకి దిగిపోయారు. బుధవారం రాత్రికే తన బృందాన్ని బద్వేలు పంపిన లోకేశ్… సత్రం భవనాల నిర్మాణాలకు అవసరమైన చర్యలను ప్రారంభించారు. పలితంగా గురువారం ఉదయానికే కాశినాయన సత్రంలో భవనాల నిర్మాణ పనులు ప్రారంభమై పోయాయి. భవన నిర్మాణాల కోసం మార్కింగ్ ప్రక్రియ పూర్తి కాగా… గురువారం మధ్యాహ్నానికి మట్టి తవ్వకాలు మొదలు కానున్నాయి. ఆ వెంటనే భవన నిర్మాణాలు కూడా శరవేగంగానే పూర్తి కానున్నాయి.