టీడీపీకి మాజీ మంత్రి సుజాత గుడ్‌బై?!

పుంజుకోవాల‌ని ఆశిస్తున్న టీడీపీకి ప్ర‌తిఘ‌ట‌న‌లు ఎదుర‌వుతున్నాయి. త‌మ‌కు ప‌ద‌వులు ద‌క్క‌లేద‌నో.. లేక పార్టీ అధిష్టానం త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌నో .. కార‌ణాల‌తో నాయ‌కులు దూర‌మ‌వుతున్నారు. తాజాగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా చింత‌ల‌పూడి మాజీ ఎమ్మెల్యే, ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన మాజీ మంత్రి పీత‌ల సుజాత పార్టీ మారుతున్నార‌నే స‌మాచారం గుప్పుమంది! పార్టీకి అంకిత భావంతో సేవ‌లు అందించిన సుజాత‌.. ఇప్పుడు మ‌నోవేద‌నతో ఉన్నారు. పోనీ.. త‌న ఆవేద‌న‌ను పార్టీ నేత‌ల‌తో చెప్పుకొందామ‌ని అనుకున్నా.. అధినేత నుంచి ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని.. ఇంకెవ‌రికి చెప్పుకోవాల‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

2004లో రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టారు పీత‌ల సుజాత‌. ఆ ఎన్నిక‌ల్లో ఆచంట నుంచి పోటీ చేసి విజ‌యం సాధించారు. అయితే, పార్టీ అధికారంలోకి రాలేదు. త‌ర్వాత టికెట్ ఇవ్వ‌లేదు. అయినా పార్టీలోనే ఉన్నారు. ఇక‌, 2014లో నియోజ‌క‌వ‌ర్గం మార్చేశారు. అయినా ఎక్క‌డా నిరాశ చెంద‌కుండా చింత‌లపూడి నుంచి పోటీ చేసి విజ‌యం సాధించారు. అంటే.. పోటీ చేసిన రెండు సార్లు.. ఎక్క‌డ నుంచి రంగంలోకి దిగినా.. విజ‌యం సాధిస్తూనే ఉండ‌డం నిజానికి ఒక మ‌హిళా నేత‌కు రికార్డేన‌ని చెప్పాలి. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు త‌న కేబినెట్‌లో మంత్రిని చేశారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. మ‌ధ్యంలోనే ఆమెను ప‌క్క‌కు పెట్టారు.

అయిన‌ప్ప‌టికీ.. ఎక్క‌డా నిరుత్స‌హం ప్ర‌ద‌ర్శించ‌కుండా.. అసంతృప్తి జాడ‌లు తెలియ‌కుండానే సుజాత వ్య‌హ‌రించారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో అనూహ్యంగా ఆమెను ప‌క్క‌న పెట్టారు చంద్ర‌బాబు. పీతలకు బదులుగా కర్రా రాజారావుకు ఇచ్చారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టు కుంది. టీడీపీ అభ్యరథి రాజారావుపై వైసీపీ తరఫున పోటీ చేసిన వీఆర్ ఎలీజా 36,175 మెజార్టీతో గెలుపొం దారు. ఇదిలావుంటే, రాజారావు.. నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా ఉంటే.. సుజాత మాత్రం చింత‌ల‌పూడిలోనే ఉంటూ.. ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్నారు. కానీ, చంద్ర‌బాబు మాత్రం ఆమెను ప‌ట్టించుకోవ‌డం లేదనే ఆవేద‌న ఉంది.

మ‌రోవైపు ఇటీవలే చంద్రబాబు పార్టీకి సంబంధించిన కమిటీలను ప్రకటించారు. జిల్లాల వారీగా కాకుండా 25 పార్లమెంటు సెగ్మెంట్లకు 25 మంది అధ్యక్షులను ప్రకటించారు. అయితే ఈ కమిటీల్లో ఏ ఒక్క దానిలోనూ పీతల సుజాతకు చోటు దక్కలేదు. ఇది మ‌రింత‌గా ఆమె ఆవేద‌న‌ను పెంచింది. దీంతో టికెట్ దక్కకపోవడం.. ఇప్పుడు కనీసం పార్టీలో ఎలాంటి పదవులు రాకపోవడంతో పీతల సుజాత తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. టీడీపీ అధిష్టానం తనను పట్టించుకోవట్లేదని అసంతృప్తితో ఉన్న సుజాత పార్టీ మారతారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ ప్ర‌చారాన్ని మ‌రింత బ‌ల‌ప‌రుస్తున్న‌ట్టుగా.. ఆమె ఇటీవ‌ల లోకేష్ ప‌శ్చిమ గోదావ‌రిలో ప‌ర్య‌టించి.. వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌ను ప‌రామ‌ర్శించారు. ఈ పర్యటనకు ఆయన వెంట పలువురు జిల్లా నేతలు రాగా.. ఇదే జిల్లాకు చెందిన పీతల సుజాత గైర్హాజరయ్యారు. దీంతో ఇక‌, ఆమె పార్టీ మార‌డం ఖాయ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో.. చూడాలి.