వైసీపీ పాలనలో ఏపీలో సొంతిల్లు లేని కుటుంబాలకు ఎక్కడిక్కడ స్థలాలతో పాటు ఇళ్ల నిర్మాణాలకు కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి గ్రామంలో ఇల్లు లేని పేదలను గుర్తించి… ఆయా గ్రామాల పరిధిలోనే ప్రభుత్వ స్థలాలు ఉంటే సరి.. లేదంటే ప్రైవేటు భూములను కొనుగోలు చేసి మరీ ఇళ్ల స్థలాలను జగన్ సర్కారు పంపిణీ చేసింది. ఒక్కో లబ్ధిదారుడికి కేవలం సెంటు, కాస్తంత ఎక్కువగా స్థలం ఉంటే సెంటున్నర స్థలాలను ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించింది. ఆ స్థలాలకు జగనన్నకాలనీలు అని పేరు పెట్టి… తాము ఇళ్లు కాదు ఊళ్లను కట్టామని చెప్పుకుంది. అయితే ఇంటి నిర్మాణం కోసం సెంటు స్థలం ఏమిటని టీడీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శలు చేశారు.
తాజాగా మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓడిపోగా… టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లోని జగనన్న కాలనీలను ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు సాంతం పరిశీలించారు. ఈ క్రమంలో ఆయా కాలనీల్లో ఇష్టారాజ్యంగా స్థలాల పంపిణీ… కాలనీల్లో అరకొరగా వసతుల కల్పన తదితరాలు వెలుగులోకి వచ్చాయి. వైసీపీ అదికారంలో ఉండగా జరిగిన ప్రచారమంతా అభూత కల్పనేనని తేలిపోయింది. ఇలాంటప్పుడు నాడు చంద్రబాబు సహా టీడీపీ నేతలు చేసిన విమర్శలు మరోమారు ప్రస్తావనకు వస్తున్నాయి. నిజమే మరి ఒక్క సెంటు అంటే… 48 చదరపు గజాల విస్తీర్ణంలో ఓ కుటుంబం నివాసానికి అనుగుణంగా ఇల్లు నిర్మించడం సాధ్యమేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా మంగళవారం నాటి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాజధాని అమరావతిపై చర్చలో భాగంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇల్లు కట్టుకోండి అంటూ పేదలకు సింగిల్ సెంటు భూమి ఇవ్వడం కూడా కక్ష సాదింపు కిందకే వస్తుందని ఆయన అన్నారు. సెంటు భూమిలో ఇంటి నిర్మాణం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు.. ఇలా చిన్న కుటుంబం అయినా.. కనీసం నలుగురు మనుషులు నివసించేందుకు సింగిల్ సెంటులో ఇల్లు నిర్మాణం ఎలా సాధ్యమవుతుంది అని ఆయన ప్రశ్నించారు. అందుకే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సింగిల్ సెంటును రద్దు చేసి పట్టణాల్లో రెండు సెంట్ల స్థలం, గ్రామాల్లో 3 సెంట్ల స్థలాన్ని ఇళ్ల నిర్మాణం కోసం ఇస్తున్నామని ఆయన తెలిపారు.