టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుతో రాజకీయ బంధాలపై బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ తరఫున సోమవారం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మనసు విప్పి మరీ మాట్లాడారు. చంద్రబాబుకు తాను వ్యతిరేకిని అన్నది కేవలం అపోహ మాత్రమేనని ఆయన ఆసక్తికర వ్యాఖ్య చేశారు. చంద్రబాబు నాయకత్వంలోనే తాను గతంలో పనిచేసిన విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. నాడు తనకు రాజమండ్రి సీటు ఇచ్చారని… అయితే తానే పోటీ చేయలేదని కూడా ఆయన తెలిపారు. అలా కాకుండా దక్కిన సీటును తీసుకుని పోటీ చేసి ఉంటే…నాడే తాను మంత్రినని కూడా ఆయన తెలిపారు.
అయినా తాను ఏదైనా విధాన నిర్ణయాలపైనే మాట్లాడతానని చెప్పిన సోము.. రాజకీయంగా గానీ, వ్యక్తిగతంగా గానీ తాను ఎన్నడూ చంద్రబాబును విమర్శించలేదని తెలిపారు. అయితే ఎందుకనో గానీ తనపై చంద్రబాబు వ్యతిరేకిని అన్న ముద్ర పడిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ముద్రకు కారణమేమిటో కూడా తనకు తెలియదని చెప్పారు. అదేదో తాను వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నానని చాలా మంది అంటారని… అయితే తాను జగన్ కు వ్యతిరేకంగా… జగన్ తీసుకున్న చాలా నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన విషయాన్ని మాత్రం వారు గుర్తించరని కూడా సోము ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 5 సీట్లు కూటమికి అందుబాటులోకి రాగా…వాటిలో మూడింటిని తీసుకున్న టీడీపీ… మిత్రపక్షాలు జనసేన, బీజేపీలకు ఒక్కో సీటును కేటాయించింది. బీజేపీ సీటును ఆ పార్టీ అధిష్ఠానం సోము వీర్రాజుకు కేటాయించింది. ఈ వార్త విన్నంతనే చంద్రబాబును నిత్యం వ్యతిరేంచే సోముకు టికెట్ దక్కిందని… ఇక టీడీపీపై బీజేపీ నుంచి వరుసగా విమర్శలు వినిపిస్తూ ఉంటాయన్న కథనాలు వెలువడ్డాయి. అదే సమయంలో ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన వీర్రాజు నేరుగా వెళ్లి చంద్రబాబును కలిశారు. ఈ సందర్బంగా సోముతో చంద్రబాబు సరదాగా గడిపారు. సోముతో అరమరికలు లేకుండానే మాట్టాడారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో తనకేమీ వైరం లేదంటూ సోము వ్యాఖ్యలు చేయడం గమనార్హం.