తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సోమవారం ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలాఖరుకు ఐదేసి ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్న సంగతి తెలిసిందే. ఈ స్థానాలు భర్తీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయగా… మొత్తం 10 స్థానాలకు 10 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఫలితంగా ఈ ఎన్నికల్లో పోలింగ్ కు అవకాశం లేదనే చెప్పాలి. నామినేషన్లు వేసిన వారంతా దాదాపుగా శాసన మండలికి ఎన్నికవడం లాంఛనమే.
ఏపీలో 5 స్థానాలకు గాను టీడీపీ మూడు సీట్లకు… జనసేన, బీజేపీలు ఒక్కో సీటు చొప్పున అభ్యర్థులను ఖరారు చేశాయి. టీడీపీ సభ్యులుగా ఎంపికైన బీద మస్తాన్ రావు, బీటీ నాయుడు, కావలి గ్రీష్మలు సోమవారం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెంట రాగా… తమ నామినేషన్లను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీని నమ్ముకున్న వారికి ఎప్పటికీ అన్యాయం జరగదని ఆయన అన్నారు. పార్టీ విధేయులకు తప్పనిసరిగా అవకాశాలు వస్తాయని, అప్పటిదాకా వేచి చూడక తప్పదన్నారు. ఈ దఫా అందుబాటులోకి వచ్చిన 3 సీట్లను బలహీన వర్గాలకు కేటాయించాలని అనుకున్నామని… ఆ మేరకే ముగ్గురు అభ్యర్థులను కూడా బలహీన వర్గాలకు చెందిన వారినే ఎంపిక చేశామని తెలిపారు. జనసేన అభ్యర్థి నాగబాబు ఇదివరకే నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఇక బీజేపీ అభ్యర్థిగా ఖరారు అయిన మాజీ ఎమ్మెల్యే సోము వీర్రాజు కూడా తన నామినేషన్ ను దాఖలు చేశారు. అటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు శంకర్ నాయక్, అద్దంకి దయాకర్, విజయశాంతిలు తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీప్ మహేశ్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు హాజరయ్యారు. కాంగ్రెస్ మిత్రపక్షం సీపీఐ అభ్యర్థి నెల్లికంటి సత్యం యాదవ్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఇక విపక్షం బీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ నేత దాసోజు శ్రావణ్ కూడా తన నామినేషన్ ను దాఖలు చేశారు.