వర్మ అసంతృప్తి లేదంటున్నా.. ప్రచారం మాత్రం ఆగట్లేదు

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల ఖరారు ముగిసింది. సోమవారంతో నామినేషన్లకు గడువు కూడా ముగిసిపోయింది. అభ్యర్థుల ఎంపిక కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీలో కొంతమేర అసంతృప్త జ్వాలలను రేపిందన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. మిగిలిన ప్రాంతాల పరిస్థితిని పక్కనపెడితే… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ విషయంలో మాత్రం ఈ దిశగా ఈ వార్తలు ఎంతకూ ఆగట్లేదు.

వాస్తవానికి పవన్ కు సీటును త్యాగం చేస్తే… ఎమ్మెల్సితో సరిపెట్టేద్దాం అంటూ టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో వర్మకు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇదివరకు రాజ్యసభ సీట్లు వచ్చినా… రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్లు వచ్చినా… తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లు వచ్చినా… వర్మకు మాత్రం అవకాశం దక్కలేదు. దీంతో ఆయన వర్గం టీడీపీ అధిష్ఠానంపై ఒకింత ఆగ్రహంతోనే ఉందని చెప్పక తప్పదు.

ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 సీట్లు టీడీపీకి దక్కితే.. వాటిని కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, బీద రవిచంద్రలకు చంద్రబాబు కేటాయించారు. అయితే ఈ సీట్లలో ఓ సీటు వర్మకు ఖాయమని ఆయన వర్గం భావించింది. అయితే ఆదివారం సాయంత్రం విడుదలైన జాబితాలో వర్మ పేరు కనిపించకపోవడంతో ఆయన వర్గం తీవ్ర నిరాశకు గురైంది.

పవన్ కోసం త్యాగం చేసిన తమ నేతకు ఇప్పటికీ న్యాయం జరక్కపోతే ఎలాగంటూ ఆ వర్గం తమ వాదనను ఒకింత గట్టిగానే వినిపిస్తోంది. అయితే పార్టీలో ఎన్నో సమీకరణాలు ఉంటాయి కదా. వాటన్నింటినీ చూసుకున్న తర్వాత గానీ… అభ్యర్థుల ఖరారు ఉండదు. ఇదే విషయాన్ని చెప్పి తన వర్గాన్ని శాంతపరుద్దామంటూ సోమవారం ఉదయం పిఠాపురంలోని తన కార్యాలయానికి వర్మ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన తనకు సీటు దక్కకపోవడానికి చాలా కారణాలు ఉంటాయని అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్పుకొచ్చారు.

ఒక్క జడ్పీటీసీ సీటును ఖరారు చేసేందుకే మనం ఎంతో లెక్కలు వేస్తాం కదా.. మరి రాష్ట్ర స్థాయిలో… అది కూడా పరిమితంగా ఉన్న సీట్లను ఆయా నేతలకు కేటాయించే విషయంలో పార్టీ అధినేత చంద్రబాబుకు ఎంతగా ఇబ్బంది ఉంటుందో అర్థం చేసుకోవాలని వర్మ అన్నారు. అయినా పదవులు దక్కినా… మరింత కాలం వేచి చూద్దాం అంటూ కూడా ఆయన సూచించారు. ఎప్పటికైనా పార్టీకి అండాదండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఏది ఏమైనా… ఏం జరిగినా కూడా పార్టీకి, చంద్రబాబుకు, లోకేశ్ కు అండగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా వర్మ వ్యాఖ్యానించారు.

వర్మ సూచనతో ఆయన వర్గం పార్టీకి అండగా నిలుస్తామంటూ నినాదాలు చేసింది. అయితే అప్పటికీ వర్మ ఇంకా అసంతృప్తిలోనే ఉన్నారని… అసలు ఆయన పార్టీలో ఉంటారా? పార్టీని వీడతారా? అంటూ విశ్లేషణలు సాగుతున్నాయి. ఇంకొందరైతే ఏకంగా వర్మ రాజకీయాలకు దూరంగా జరుగుతారని చెబుతున్నారు. ఇంకొందరు మరో అడుగు ముందుకేసి వైసీపీ నుంచి వర్మకు ఆహ్వానం అందిందని కూడా ప్రచారం చేస్తుండటం గమనార్హం.