బాబు, లోకేశ్ లు చెప్పిందదేగా… రచ్చ ఎందుకు?

ఏపీలో ఇప్పుడు ఓ అంశంపై విపరీతంగా చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో అయితే మరింతగా దీనిపై చర్చకు తెర లేసింది. అదేంటంటే… తాము అదికారంలోకి వస్తే రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని కూటమి పార్టీలు చెప్పిన సంగతి తెలిసిందే. కూటమి ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల్లో ఇది కూడా ఒకటి. దీనిపై గురువారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఓ ప్రకటన చేశారు. జిల్లా పరిధిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని… జిల్లా దాటితే మాత్రం ఈ పథకం మహిళలకు వర్తించదని ఆమె స్పష్టం చేశారు.

మంత్రి సుధారాణి నుంచి ఈ ప్రకటన వచ్చినంతనే… విపక్ష వైసీపీ, కూటమి వ్యతిరేక వర్గాలన్నీ ఒక్కసారిగా గళం విప్పాయి. మరో హామీని కూటమి సర్కారు నీరు గార్చేసిందని వైసీపీ ఆరోపించింది. కూటమి హామీలను నమ్మి ఓట్లు వేసిన మహిళలకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించింది. బాబు ష్యూరిటీ… భవిష్యత్తుకు గ్యారెంటీ అని కూటమి నాడు చేసిన ప్రచార నినాదాన్ని బాబు ష్యూరిటీ… మోసం గ్యారెంటీ అంటూ మార్చేసి కూటమి సర్కారుపై ఓ రేంజిలో ట్రోలింగ్ చేస్తోంది. న్యూట్రల్ సొసైటీ అని చెప్పుకునే కొందరు వ్యక్తులు కూడా ఇదే తీరున ప్రచారం మొదలుపెట్టారు. అయితే కూటమిలో కీలక భాగస్వామి అయిన టీడీపీ కూడా ఈ వ్యవహారంలోకి దూకుడుగానే దిగిపోయింది.

2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుతో పాటు, టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు విస్తృతంగా ప్రచారం చేశారు. కూటమి హామీలన్నీ కూడా ఈ ముగ్గురే జనంలోకి చొచ్చుకు వెళ్లేలా చేశారు. బాబు, పవన్, లోకేశ్ లు ఇచ్చిన హామీలను జనం నమ్మారు. కూటమికి రికార్డు విక్టరీని కట్టబెట్టారు. నాడు సూపర్ సిక్స్ హామీల ప్రకటనలో భాగంగా బాబు, లోకేశ్ లు ఏం చెప్పారన్న విషయాన్ని ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియా బయటకు తీసింది. ఆ పాత వీడియోలను ఇప్పుడు సాక్ష్యాలుగా చూపెడుతూ వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పి కొడుతున్నారు.

నాడు చంద్రబాబు అయినా… లోకేశ్ అయినా… మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఏం చెప్పారన్న విషయానికి వస్తే… జిల్లా పరిధిలో రాష్ట్ర మహిళలకు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తామని వారు చెప్పారు. మా ఆడబిడ్డలు జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో టికెట్ లేకుండానే ప్రయాణిస్తారని… ఆ దిశగా హామీ ఇస్తున్నామని వారిద్దరూ చాలా స్పష్టంగా చెప్పారు. ఇదే విషయం ఇప్పుడు టీడీపీ వింగ్ పోస్ట్ చేస్తున్న పాత వీడియోల్లోనూ ఇదే ఉంది. అంటే… చంద్రబాబు, లోకేశ్ లు చెప్పిన విషయాన్నే మంత్రి సంధ్యారాణి చెప్పారు కదా అంటూ టీడీపీ యాక్టివిస్టులు చెబుతున్నారు. వెరసి పాత వీడియోలతో టీడీపీ వింగ్ కొట్టిన దెబ్బకు వైసీపీ చేస్తున్నదంతా దుష్ప్రచారమేనని తేలిపోయింది.