బోరుగడ్డ అనిల్ కుమార్ పేరు మొన్నటిదాకా మారుమోగిపోయింది. ప్రతి రోజు ఆయన పేరు ప్రధాన పత్రికల్లో తప్పనిసరిగా కనిపించేది. ఏ నేతనో బెదిరించారనో, ఏదో కేసు నమోదు అయ్యిందనో, మరో కేసులో పీటీ వారెంట్ జారీ అయ్యిందనో, పోలీస్ స్టేషన్ లోనే రాచ మర్యాదలు అనో, పోలీసులకే స్టార్ హోటల్ తీసుకెళ్లారనో, పోలీసులే బిర్యానీ తినిపించారనో… కోర్టు బెయిల్ పిటిషన్ ను కొట్టేసిందనో… ఇలా ఏదో ఒకటి బోరుగడ్డకు సంబంధించిన వార్త వస్తూనే ఉండేది. అయితే కొంతకాలంగా అనిల్ వార్తలేమీ వినిపించడం లేదు. బెదిరింపుల కేసుల్లో అరెస్టైన అనిల్.. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్నారు కదా.. అక్కడే ఉండి ఉంటారులే అని అంతా అనుకున్నారు. అయితే జైలు నుంచి ఆయన చాలా రోజుల క్రితమే బయటకు వచ్చారట. అయితే ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారో పోలీసులకు కూడా తెలియదట.
నిజమేనండోయ్.. ప్రస్తుతం బోరుగడ్డ అనిల్ ఎక్కడ ఉన్నారనే విషయం పోలీసులకు కూడా తెలియదట. ఈ విషయాన్ని ఇటు ఆయన సొంతూరు గుంటూరు, ఆయనను జైల్లోనే ఉంచేసిన కేసు నమోదు చేసిన అనంతపురం పోలీసులకు కూడా ఆయన ఎక్కడ ఉన్నారన్న విషయం తెలియదట. వెరసి కలకలం రేగింది. అదేంటీ… జైలులో ఉండాల్సిన అనిల్ ఎప్పుడు బయటకు వచ్చారనుకుంటున్నారా? గత నెలలోనే ఓ సారి మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చిన ఆయన కోర్టు చెప్పినట్లుగానే తిరిగి జైలుకు వెళ్లారట. ఆ తర్వాత మరోమారు మధ్యంతర బెయిల్ ను పొడిగించుకుని బయటకు వచ్చారట. ఆ తర్వాత ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదట. ఇలా హై ప్రొఫైల్ కేసులోని కీలక నిందితుడికి బెయిల్ వచ్చిన విషయం పోలీసులకు కూడా తెలియదా? అంటే…జైలు అదికారులు చెబితే కదా వారికైనా తెలిసేది.
వైసీపీ అధికారంలో ఉండగా… టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ లను ఒకే ఒక్క గంటలో చంపేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన అనిల్ అందరి దృష్టినీ ఆకర్షించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా తనను తాను చెప్పుకున్న అనిల్… విపక్షాలకు చెందిన పలువురు కీలక నేతలను బెదిరిస్తూ సాగారు. బెదిరింపులకు పాల్పడ్డారు. బలవంతపు వసూళ్లకూ పాల్పడ్డారు. కూటమి సర్కారు పాలన మొదలు కాగానే అనిల్ పై నమోదు అయిన కేసులను తీసిన పోలీసులు అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన కేసులో ఆయనను అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా 14 కేసులు నమోదు అయినట్లు తేలింది. ఈ కేసులన్నింటిలో బెయిల్ తెచ్చుకున్నా… అనంతపురంలో జిల్లా కలెక్టర్, ఎస్పీలను బురిడీ కొట్టించిన కేసులో మాత్రం ఆయనకు బెయిల్ రాలేదు.
ఈ క్రమంలో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉంటున్న అనిల్ తన తల్లి అనారోగ్యంగా ఉన్నారని…ఆమెకు చికిత్స చేయించేందుకు తనకు బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు అనిల్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ బెయిల్ రాగానే… బయటకు వచ్చిన అనిల్ తల్లికి చికిత్స చేయించి కోర్టు చెప్పిన సమయానికి తిరిగి జైలుకు వెళ్లారట. ఆ తర్వాత మరోమారు తల్లి అనారోగ్యాన్నే ప్రస్తావిస్తూ మరోమారు బెయిల్ కోరగా… కోర్టు సరేనని ఆయనకు బెయిల్ ఇచ్చింది. ఈ బెయిల్ ఈ నెల 11తో ముగినుంది. అయితే ఇలా రెండు సార్లు అనిల్ కు బెయిల్ వచ్చిన విషయం అటు గుంటూరు పోలసులకు గానీ, ఇటు అనంతపురం పోలీసులకు గానీ సమాచారమే లేదట.
బెయిల్ వచ్చిన వెంటనే అనిల్ జైలు బయటకు వచ్చేశారు. అది ముగియగానే తిరిగి జైలుకు వెళ్లిపోయారు. మరోమారు బెయిల్ రాగానే… అనిల్ ను జైలు అదికారులు వదిలిపెట్టారు. మరి ఈ సారి బెయిల్ గడువు ముగిసిన తర్వాత ఆయన తిరిగి జైలుకు వస్తారో, లేదో తెలియదు. ఎందుకంటే…ప్రస్తుతం ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందట. అనిల్ తల్లి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లోనే ఉందట. అయినా ఈ విషయం ఇప్పుడు ఎలా బయటకు వచ్చిందంటే… రెండో సారి బెయిల్ కోసం అనిల్ ఓ డాక్టర్ సర్టిఫికెట్ ను కోర్టుకు ఇవ్వగా… అది నిజమైనదో, కాదో తేల్చాలని కోర్టు చెబితే… అప్పుడు తొలుత అనంతపురం పోలీసులకు, వారి నుంచి గుంటూరు పోలీసులకు ఈ విషయం తెలిసిందట. అనిల్ బయటకు వచ్చిన విషయమే తమకు తెలియదంటూ వారు ఆయనకు ఫోన్ చేయగా…స్విచ్ ఆఫ్ అని రావడంతో అందరిలో టెన్షన్ మొదలైంది.