ఢిల్లీలో బాబు… అమిత్ షాతో సుదీర్ఘ భేటీ

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు బుధవారం దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీ చేరుకున్న వెంటనే చంద్రబాబు… కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దాదాపుగా గంటకు పైగా సాగి ఈ సుదీర్ఘ భేటీలో చంద్రబాబు చాలా విషయాలనే ప్రస్తావించారు. రాష్ట్ర పునర్విభజన చట్టం అమలులో భాగంగా ఇంకా పెండింగ్ లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అమిత్ షాను చంద్రబాబు కోరారు. ఈ సమస్యలు పరిష్కారం అయితే పొరుగు రాష్ట్రం తెలంగాణతో మరింత స్నేహపూర్వక వాతావరణం నెలకొనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు.

ఇక ఆయా శాఖల నుంచి రాష్ట్రానికి కేంద్రం నుంచి విడుదల కావాల్సిన నిధులు, జారీ కావాల్సిన అనుమతుల విషయంపైనా చంద్రబాబు ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. ఆయా శాఖలకు కేంద్రం నుంచి మంచి సహకారమే అందుతోందని చెప్పిన చంద్రబాబు…మరింత సహకారాన్ని కోరారు. ఆ మేరకు ఆయా కేంద్ర శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ఆయన అమిత్ షాను కోరారట. కేంద్రం నుంచి అందుతున్న నిధుల వినియోగాన్ని కూడా చంద్రబాబు ఈ సందర్భంగా అమిత్ షా ముందు పెట్టినట్లు సమాచారం. ఏ పని కోసం ఇస్తున్న నిధులను ఆయా పనుల కోసమే వెచ్చిస్తున్న వైనాన్ని చంద్రబాబు కేంద్ర మంత్రికి తెలియజేశారట.

ఇక రాజకీయ అంశాల విషయానికి వస్తే… ఇటీవలే వైసీపీతో పాటుగా రాజ్యసభ సభ్యత్వానికి కూడా విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సీటు భర్తీ విషయాన్ని ప్రస్తావించిన చంద్రబాబు…ఏపీలోని కూటమి నేతలతోనే భర్తీ చేయాల్సి ఉన్నందున… ఆ సీటును ఎవరికిద్దామన్న విషయంపై అమిత్ షాతో ఆరా తీసినట్లు సమాచారం. అమిత్ షాతో భేటీని ముగించుకున్న చంద్రబాబు…అక్కడి నుంచి నేరుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ కోసం వెళ్లారు. ఆ తర్వాత కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గద్కరీతోనూ చంద్రబాబు భేటీ కానున్నారు.