రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా.. వైసీపీకి ఛాన్స్ ఇచ్చే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. కూటమి పార్టీలు ఏకంగా ఉంటాయని, చిన్న చిన్న విభేదాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఏ ఎన్నికైనా అందరూకలిసి కట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఎమ్మెల్సీల అభినందన సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం దక్కించుకున్న ఆలపాటి రాజేంద్రప్రసాద్, పేరాబత్తలు రాజశేఖర్ను ఘనంగా సత్కరించారు. వీరిద్దరి విజయానికి కృషి చేసిన కూటమి పార్టీల నాయకులను అభినందించారు.
అనంతరం.. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కూటమి విజయం రాష్ట్ర ప్రజల విజయంగా అభివర్ణించారు. కలసి కట్టుగా ఉంటే.. విజయం మనదేనని పార్టీ నాయకులకు తేల్చి చెప్పారు. వైసీపీకి ఛాన్స్ ఇవ్వకూడదని.. జనసేన, టీడీపీలు నిర్నయించుకున్నా యని.. బీజేపీ లైన్ కూడా అదేనని పేర్కొన్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కలసి కట్టుగా ఉండి విజయం దక్కించుకున్నా మని చెప్పారు. ఇప్పుడు కూడా ఘన విజయం దక్కిందని, గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే కూడా ఇప్పుడు మరిన్నిఎక్కువ ఓట్లు సాధించామన్నారు. ఈ విజయం మున్ముందు మరింత బలంగా మారాలని.. ఏ ఎన్నిక ఎప్పుడు వచ్చినా.. కూటమికే దక్కేలా నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కూటమి ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం పెరిగిందనడానికి తాజాగా జరిగిన ఎన్నికలే నిదర్శనమని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ నమ్మకాన్ని మరింత పెంచుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. నేను-నాది.. అనే భావన వదిలి పెట్టి.. మనం అనే భావనతో కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు. వైసీపీ పాలనతో విధ్వంసం అయిపోయిన రాష్ట్రాన్ని పునర్నిస్తున్నామని చెప్పారు. దీనికి కూటమిలో ఉన్న బీజేపీ సాయం చేస్తోందని, ఇప్పటికే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నిలబెట్టామని.. అమరావతి రాజధానిని కూడా నిలబెట్టుకుంటున్నామని.. వ్యాఖ్యానించారు. వైసీపీ ధ్వంసంచేసిన వ్యవస్థలను ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతున్నామన్న చంద్రబాబు.. ఇక మీదట వైసీపీకి ఛాన్స్ ఇవ్వకుండా వ్యవహరించాలని సూచించారు.