తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు వ్యతిరేకంగా తాజాగా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆయన ఓ పార్టీకి అధినేత అని.. గతంలో రాష్ట్రాన్ని పాలించారని.. ఇంత బాధ్యతాయుతమైన నాయకుడు.. ప్రస్తుతం అసెంబ్లీని ఎగ్గొడుతున్నారన్నది పిటిషన్ దారుడు చేసిన వాదన. అంతేకాదు.. ఆయనను సభకు రప్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కూడా కోరారు. ఈ మేరక విజయ్పాల్ రెడ్డి అనే సామాజిక ఉద్యమ కారుడు.. పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారణకు తీసుకున్న కోర్టు.. ఏం చేయాలని ప్రశ్నించడం గమనార్హం.
కేసీఆర్.. తెలంగాణ ముఖ్యమంత్రిగా పదేళ్లు(కొంత తక్కువ) రాష్ట్రాన్ని పాలించారు. గత 2023లో జరిగిన ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు. అయితే.. ఆయన వ్యక్తిగతంగా మాత్రం ఎమ్మెల్యేగా విజయం దక్కించుకున్నారు. అదేసమయంలో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారు. అయినప్పటికీ.. సభకు హాజరు కావడం లేదన్నది వాస్తవం. దీనిపై ఇటు సభలోనూ.. అటు రాజకీయంగా కూడా కేసీఆర్ విమర్శలు ఎదుర్కొన్నారు. ఎదుర్కొంటున్నారు. ఆయన తప్ప.. మిగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం హాజరు అవుతున్నారు.
గత ఏడాది బడ్జెట్ సమావేశాల సందర్భంగా తొలిసారి సభకు వచ్చినా.. కొద్ది సేపు ఉండి బయటకు వచ్చి.. మీడియాతో మాట్లాడి వెళ్లిపోయారు. ఇక, అప్పటి నుంచి కేసీఆర్ సభకు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే విజయ్పాల్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. కేసీఆర్ సభకు వచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.అయితే.. ఈ పిటిషన్పై తొలుత విస్మయం వ్యక్తం చేసిన కోర్టు.. తమ పరిధిలో ఉందా? అని ప్రశ్నించింది. దీనిపై పిటిషనర్ తరఫున న్యాయవాది..తమకు కొంత సమయం కావాలని కోరారు. దీంతో దీనిని రెండు వారాలకు వాయిదా వేసింది.
ఇదిలావుంటే.. అసెంబ్లీ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది మాత్రం.. అసలు ఈ వ్యాజ్యం కొట్టేయాలని కోరడం గమనార్హం. కేసీఆర్ తరఫున ఎవరూ వాదనలు వినిపించలేదు. ఆయనకు నోటీసులు పంపించిన తర్వాతే.. ఆయన తరఫున వాదనలు వినే అవకాశం ఉంటుంది. ఇదిలావుంటే.. దేశంలో ఇలా.. ఒక ప్రతిపక్ష నాయకుడు సభకు రావడం లేదని పేర్కొంటూ దాఖలైన రెండో కేసు ఇది. గతంలో బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్పై దాఖలైంది. అయితే.. ఇది స్పీకర్ పరిధిలోని అంశం అంటూ.. బీహార్ హైకోర్టు అప్పట్లో కొట్టేసింది. ఆ తర్వాత.. ఇప్పుడు కేసీఆర్ పై సభకు రావడం లేదంటూ కేసు దాఖలైంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.