పల్నాడు జిల్లా దాచేపల్లిలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గ్రామ సచివాలయం-3 వెల్ఫేర్ అసిస్టెంట్ సంపతి లక్ష్మీప్రసాద్ ప్రజలకు పంపిణీ చేయాల్సిన పెన్షన్ డబ్బుతో పరారయ్యాడు. ఈ నెల 1న పింఛన్ తీసుకోవాల్సిన, లబ్ధిదారులకు డబ్బు అందకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అధికారులు అతని ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, తాజాగా లక్ష్మీప్రసాద్ ఒక సెల్ఫీ వీడియో విడుదల చేయడంతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది.
సెల్ఫీ వీడియోలో లక్ష్మీప్రసాద్ తన కష్టాలను వెల్లడించాడు. “నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నెలరోజుల్లో డబ్బులు తిరిగి చెల్లిస్తాను. ఆన్లైన్ బెట్టింగుల్లో మోసపోయాను. నా కుటుంబం రెండు రోజులుగా అన్నం కూడా తినలేదు. కలెక్టర్, దాచేపల్లి కమిషనర్ నన్ను క్షమించండి. నా తల్లిదండ్రులను బతిమిలాడైనా డబ్బులు తెచ్చి ఇస్తాను,” అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను చేసిన తప్పు కారణంగా కుటుంబం ఎంతో కష్టాల్లో పడిందని, మూడ్రోజులుగా వారు ఆందోళనలో ఉన్నట్లు చెప్పారు.
లక్ష్మీప్రసాద్ తన పొరపాటును అంగీకరించాడు. పెన్షన్ డబ్బుతో తాను ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటు పడిపోయి చివరికి మోసపోయానని చెప్పాడు. సెల్ఫీ వీడియోలో అతనితో పాటు అతని భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాను చేసిన తప్పు వల్ల కుటుంబం రోడ్డున పడిందని, తనను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలని వేడుకున్నాడు.
ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. “మనం అందరం మనుషులమే, పొరపాట్లు సహజమే. కానీ, వాటి నుంచి నేర్చుకోవాలి. మీ కుటుంబ భద్రతను ముందు ఉంచండి, జీవితాలను నాశనం చేసే బెట్టింగ్ యాప్లను దూరం పెట్టండి. మేము మీ సంక్షేమాన్ని కోరుకుంటున్నాం. సురక్షితంగా ఇంటికి తిరిగి రండి,” అని ట్వీట్ చేశారు.
ప్రస్తుతం జిల్లా అధికారులు లక్ష్మీప్రసాద్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అతను పెన్షన్ డబ్బు దుర్వినియోగం చేసినందున న్యాయపరమైన చర్యలు తప్పవని సమాచారం. అయితే, అతని కుటుంబ పరిస్థితిని పరిశీలించి ప్రభుత్వం ఏదైనా పరిష్కారం చూపుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.