ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మంగళవారం ఓ అవాంఛిత సంఘటన చోటుచేసుకుంది. సభలో సభ్యులు చర్చలు జరుపుతుండగా, ఒక ఎమ్మెల్యే పాన్ మసాలా నమిలి హాల్లోనే ఉమ్మేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అసెంబ్లీ వంటి గౌరవప్రదమైన వేదికలో ఇలాంటి ఘటనలు జరగడం అంగీకారయోగ్యం కాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా వెంటనే స్పందించి, సంబంధిత ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. స్పీకర్ హాల్ను శుభ్రం చేయించడమే కాకుండా, సభ సభ్యులను గౌరవప్రదంగా వ్యవహరించాలని హెచ్చరించారు. ఉమ్మేసిన ఎమ్మెల్యే ఎవరో తాను గుర్తించానని, అయితే ఆ వ్యక్తి తనంతట తానే ముందుకు వచ్చి వివరణ ఇవ్వాలని సూచించారు. లేదంటే తానే తన ఛాంబర్కు పిలవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
సభ్యుల బాధ్యతతో కూడిన ప్రవర్తన అవసరమని స్పీకర్ హితవు పలికారు. అసెంబ్లీ హాల్ను పరిశుభ్రంగా ఉంచడం ప్రతిఒక్కరి బాధ్యత అని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇకపై ఎవరైనా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే, తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, అసెంబ్లీలో ఎమ్మెల్యే ఉమ్మేయడం, స్పీకర్ స్వయంగా శుభ్రం చేయించడాన్ని చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసెంబ్లీ వంటి ప్రాముఖ్యత గల వేదికలో ఓ ప్రజా ప్రతినిధి ఇలాంటి చర్యకు పాల్పడటం బాధాకరమని పలువురు వ్యతిరేకిస్తున్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ఎమ్మెల్యేలు ఇటువంటి చర్యలకు పాల్పడితే, ప్రజాస్వామ్య వ్యవస్థ పరువు తీసేలా ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.
ఈ ఘటన అనంతరం అసెంబ్లీలో మరింత కఠినమైన నిబంధనలు అమలు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రజాస్వామ్య వేదికల్లో మర్యాద మరియు శుభ్రత కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడిపైనా ఉందని స్పష్టమవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates