ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అందరూ ముద్దుగా ఆలపాటి రాజా అని పిలుచుకుంటారు. ఈ పేరు వింటేనే టీడీపీ శ్రేణుల్లో ఓ ప్రత్యేక వైబ్రేసన్ ఉవ్వెత్తున ఎగసి పడుతుంది. టీడీపీకి నమ్మిన బంటు. అదే టీడీపీకి ఆయన ఓ బలం కూడా. పార్టీ హైకమాండ్ మాటే తన మాట. పార్టీ ఏది చెబితే.. ముందూ వెనుకా చూడకుండా రంగంలోకి దిగిపోయే తత్వమున్న అతి కొద్ది మంది నేతల్లో ఆలపాటి అందరి కంటే ముందు వరుసలో ఉంటారని చెప్పాలి. పార్టీ నియమావళికి కంకణబద్ధుడిగా ఉండే ఆలపాటికి ఇలా అవకాశాలు వచ్చినట్టే వచ్చి… అలా జారిపోయాయి. అయితే ఏనాడూ ఆయన ఇబ్బంది పడలేదు. పార్టీని ఇబ్బంది పెట్టనూ లేదు. తనకు అవకాశం వచ్చే దాకా ఎదురు చూశారు. అవకాశం రాగానే… రికార్డు మెజారిటీతో ఎమ్మెల్సీగా విక్టరీ కొట్టి… తన సత్తా ఏమిటో ఇప్పటి తరానికి కూడా గుర్తుండిపోయేలా చేశారు.
ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కూటమి తరఫున బరిలోకి దిగిన ఆలపాటిపై విపక్షం పోటీ పెట్టకున్నా… ఆలపాటి సత్తా ఏమిటో తెలిసిన నేపథ్యంలో ఆయనను ఓడించేందుకు అందుబాటులో ఉన్న అన్ని ఆయుధాలను వాడిందన్న విశ్లేషణలు లేకపోలేదు. అప్పటికే పీడీఎఫ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావుకు వైసీపీ మద్దతు పలికింది. అయితే ఆలపాటి ఈ పన్నాగాలు అన్నింటినీ గమనిస్తూనే సాగారు. ఎక్కడ కూడా పరిస్థితులను శృతి మించనీయకుండా పద్ధతిగా ఎన్నికలు జరిగేలా చూశారు. గ్రాడ్యుయేట్స్ మైండ్ సెట్ ను చదివిన ఆలపాటి… వారితో ఎలా ఓట్లు వేయించుకోవాలన్న దానిపై ఓ స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగారు. ఆలపాటి ప్లాన్ వర్కవుట్ కావడం కంటే కూడా ఆలపాటి ఊహించనంత రేంజిలో ఏకంగా 82 వేలకు పైగా మెజారిటీ రావడం ఆయననే ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి.
వాస్తవానికి ఆలపాటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన నేత కాదు. ప్రత్యక్ష ఎన్నికల్లో అటు ఎమ్మెల్యేగానో లేదంటే లోక్ సభ సభ్యుడిగానో పోటీ చేయాల్సిన నేత ఆలపాటి. విద్యాధికుడైన ఆలపాటి… అన్ని విషయాలపై సమగ్ర పట్టు కలిగిన నేతగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పటిదాకా కేవలం ఒక్కటంటే ఒక్కసారి మాత్రమే ఆలపాటి ఎమ్మెల్యేగా వ్యవహరించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఆయన తెనాలి నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత తన రాజకీయ ప్రత్యర్థి అన్నాబత్తుని శివకుమార్ చేతిలో 2019లో పరాజయం పాలయ్యారు. ఇక 2024లో జనసేనతో టీడీపీకి పొత్తు లేకపోయి ఉంటే… తెనాలి టికెట్ ఆలపాటిదే. అయితే జనసేనతోనే కాకుండా బీజేపీతోనూ పార్టీ పొత్తు పెట్టుకుంది. ఫలితంగా సీట్ల సర్దుబాటులో భాగంగా ఆలపాటి తన సీటును జనసేనకు చెందిన నాదెండ్ల మనోహర్ కు త్యాగం చేయక తప్పలేదు.
ఈ సందర్భంగా ఆలపాటి మరో ఆలోచనే లేకుండా పార్టీ హైకమాండ్ మాటకు తలూపేశారు. నాదెండ్ల విజయానికి కష్టపడ్డారు. ఆ తర్వాత కూడా ఆయన తనకు ఫలానా పదవి కావాలని ఏనాడూ నోరు తెరిచి అడిగిందే లేదు. ఆలపాటి సత్తా ఏమిటో అధిష్ఠానానికి తెలుసు కాబట్టే…కీలకమైనదే కాకుండా కాస్తంత కఠినతరమైన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ బరిలో ఆయనను దింపింది. ఈ ఎన్నికలో అధిష్ఠానం వ్యూహం నూటికి వెయ్యి పాళ్లు కరెక్ట్ అని టీడీపీ శ్రేణులు భావించాయి. ఏ ఒక్కరూ పిలవకుండానే పార్టీ శ్రేణులు ఆలపాటి గెలుపు కోసం నిస్వార్థంగా రణరంగంలోకి దిగేశాయి. ఏదో సినిమాలో చెప్పిన డైలాగ్ మాదిరి సరైన నేతకు సరైన పోటీ దక్కితేనే అసలైన మజా అన్నట్లుగా కష్టతరమైన బరిలోకి ఆలపాటిని దింపిన టీడీపీ హైకమాండ్ తన వ్యూహ బలం ఏమిటో నిరూపించుకుంది. అదే సమయంలో పార్టీకి బలమైన నేతగా ఉన్న ఆలపాటికి చట్టసభల్లోకి మరోమారు ఎంట్రీ ఇప్పించింది.
ఆలపాటి వాగ్ధాటి, ప్రజా సమస్యలపై కమిట్ మెంట్, ఆయా అంశాల పట్ల సంపూర్ణ అవగాహన, ఎదుటివారు ఎంతటి వారైనా వెన్నుచూపని వీరుడిలా పోరాడే తీరు, ఒంటి చేత్తో తన వాదనను నెగ్గించుకునే పంతం… వీటన్నింటి కంటే కూడా పార్టీపై ఈగ వాలినా ఇట్టే రంగంలోకి దిగిపోయే తత్వం ఉన్న ఆలపాటి శాసనమండలిలో అడుగుపెడుతున్నారంటే… టీడీపీకే కాకుండా యావత్తు కూటమికి వెయ్యేనుగుల బలం వచ్చినట్టే. అసెంబ్లీలో ఎలాగూ బలం లేని వైసీపీ ముఖం చాటేసింది. అయితే మండలిలో మెజారిటీ కలిగిన వైసీపీ సభలో కూటమిపై ఆదిపత్యం చెలాయించే దిశగా ఓ మోస్తరు పోరాటం అయితే చేస్తోంది. ఇప్పుడు ఆలపాటి ఎంట్రీతో వైసీపీ దూకుడుకు మండలిలో చెక్ పడినట్టేనన్న వాదనలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.