ఆ నిర్ణ‌యంతో బీజేపీ అట్ట‌ర్ ఫ్లాప్‌!!

రాజ‌కీయాల్లో ఏ పార్టీ అయినా.. తీసుకునే నిర్ణ‌యాలు ఆ పార్టీని డెవ‌ల‌ప్ చేసేలా ఉండాలి. ఆ పార్టీకి ప్ర‌జ‌ల్లో ఊపు పెంచేలా ఉండాలి. అంతేకాదు, పార్టీకి ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ పెరిగేలా చూడాలి. అప్పుడే ఏ పార్టీ అయినా పుంజుకుంటుంది. ప‌దికాలాల పాటు ప్ర‌జ‌ల్లో నిలుస్తుంది. కానీ,ఏపీ బీజేపీ అనుస‌రిస్తున్న వ్యూహంతో పార్టీ అభివృద్ధి మాట అటుంచి.. ప్ర‌జ‌ల్లోకి వెళ్లే ఛాన్స్ కూడా లేకుండా పోతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నేత‌ల‌ను ఎక్క‌డిక‌క్క‌డ క‌ట్ట‌డి చేస్తున్న కార‌ణంగా పార్టీ త‌ర‌ఫున మాట్లాడే వారు ఒక‌రిద్ద‌రు త‌ప్ప‌.. మిగిలిన వారు మీడియా జోలికి కూడా రావ‌డం లేదు.

దీంతో పార్టీ వాయిస్ వినిపించేవారు కూడా క‌నిపించ‌డం లేదు. క‌న్నా లక్ష్మీనారాయ‌ణ బీజేపీ సార‌థిగా ఉన్న స‌మ‌యంలో చాలా మందిని ప్రోత్స‌హించారు. మీరు కూడా మాట్లాడాలి. నేను ఒక్క‌డినే మాట్లాడితే కుద‌ర‌దు. ఎంతో కాలంగా పార్టీలో ఉన్నారు. పార్టీలైన్ మీకు తెలుసు. వ‌చ్చి న అవ‌కాశాన్ని వ‌దులు కోకండి. మాట్లాడండి అని ఆయ‌న ప్రోత్స‌హించేవారు. దీంతో చాలా మంది నేత‌లు ముందుకు వ‌చ్చి.. బీజేపీ త‌ర‌పున వాయిస్ వినిపించేవారు. జిల్లాల్లోనూ నేత‌లు మీడియా స‌మావేశాలు పెట్టేవారు. ఎక్క‌డా వారు వివాదం అయిన సంద‌ర్భాలు పెద్ద‌గా లేవు. ఒక‌టి అరా వివాదం అయినా.. రాష్ట్ర చీఫ్‌గా క‌న్నా వాటిని స‌రిచేసేవారు.

అంతే త‌ప్ప‌..ఎక్క‌డా అస‌లు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? అని ఆయ‌న ఎవ‌రినీ నిల‌దీసిన ప‌రిస్థితి లేదు. కానీ.. ఇప్పుడు సోము వీర్రాజు హ‌యాంలో మాత్రం పార్టీ త‌ర‌ఫున ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. ఏ ఒక్క‌రూ కూడా మీడియా మీటింగులు పెట్ట‌డం లేదు. ఏదైనా మాట్లాడాలంటే.. ఏం మాట్లాడాల‌ని అనుకుంటున్నారో.. ఏం మాట్లాడ‌తారో.. ఎలా మాట్లాడ‌తారో.. ముందుగా స్క్రిప్టు త‌న‌కు పంపించాల‌ని ఆయ‌న ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు, ఎవ‌రెవ‌రు మాట్లాడాలో కూడా ఆయ‌నే నిర్ణ‌యించారు. మ‌రీ ముఖ్యంగా ఉద‌యం, సాయంత్రం వివిధ చానెళ్ల‌లో వ‌చ్చే డిబేట్ల విష‌యంలో ఆయ‌న ఏకంగా నిషేధ‌మే విధించారు.

ఎవ‌రూ డిబేట్ల‌కు హాజ‌రు కావ‌ద్ద‌ని ఆదేశారు. ఆయ‌న మాట విన‌క‌పోతే.. వేటు వేస్తున్నారు. దీంతో ఎవ‌రూ కూడా పార్టీత‌ర‌ఫున వాయిస్ వినిపించాలంటేనే హ‌డ‌లి పోతున్నారు. ఏదైనా ఉంటే.. సోము గారే మాట్లాడ‌తారు! అని స‌మాధానం ఇస్తున్నారు. ఫ‌లితంగా పార్టీ వాయిస్ వినిపించేవారు క‌రువ‌వుతున్నారు. ఇది పార్టీ ఎదుగుద‌ల‌కు.. ప్ర‌జ‌ల్లో పార్టీ గుర్తింపున‌కు కూడా నోచుకోకుండా పోతోంద‌న్న‌ది ద్వితీయ శ్రేణి నేత‌ల ఆవేద‌న. మ‌రి ఈ నిర్ణ‌యాన్ని సోము వెనక్కి తీసుకుంటారో.. లేక‌, తాను తీసుకున్న నిర్ణ‌య‌మే స‌రైంద‌ని అనుకుంటారో చూడాలి.