జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం సోదరుడు, పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్న కొణిదెల నాగేంద్ర బాబు అలియాస్ నాగబాబుకు ఎమ్మెల్సీ ఖరారు అయ్యింది. ప్రస్తుతం ఏపీ శాసన మండలిలో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఎమ్మెల్సీ సీట్లన్నీ… అధికార కూటమి ఖాతాలోనే పడనున్నాయి. వైసీపీకి సరిపడినంత మంది ఎమ్మెల్యేలు లేని నేపథ్యంలో ఆ పార్టీ ఈ ఎన్నికల బరిలో కూడా నిలిచే అవకాశం లేదు. వెరసి మొత్తం 5 సీట్లు అధికార కూటమికే దక్కనున్నాయి.
ఈ 5 ఎమ్మెల్సీ సీట్లకు అభ్యర్థులుగా ఎవరెవరిని ఎంపిక చేయాలన్న దిశగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గత కొంతకాలంగా కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. 5 సీట్లలో కూటమిలోని జనసేన, బీజేపీలు కూడా తమకూ ఒకటో, రెండో సీట్లను కోరే అవకాశం లేకపోలేదు. గతంలో ఆయా పార్టీల మధ్య జరిగిన సీట్ల సర్దుబాటు, అసెంబ్లీలో ఆయా పార్టీలకు ఉన్న సభ్యుల సంఖ్య, రాజకీయంగా ఆయా పార్టీలకు ఉన్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని 3 పార్టీలు సమన్వయంతోనే ముందుకు సాగుతున్నాయి. ఇప్పటిదాకా ఈ విషయంలో ఎలాంటి విభేదాలు లేవనే చెప్పాలి.
ఈ క్రమంలో సోమవారం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే పవన్ కల్యాణ్… చంద్రబాబు వద్దకు వెళ్లారు. కాసేపు ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని చర్చించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ కు వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయం చర్చకు రాగా… గతంలో చంద్రబాబు ఇచ్చిన మాట మేరకు నాగబాబుకు ఓ సీటును కేటాయిస్తున్నట్లు చంద్రబాబు చెప్పగా… అందుకు ప్రతిగా పవన్ కల్యాణ్ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. మిగిలిన 4 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత నాగబాబు సహా మిగిలిన అందరి పేర్లను ప్రకటించనున్నారు.