ఏపీలో కూటమి సర్కారు పాలన మొదలైన వెంటనే రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. ఇప్పటికే కూటమి పాలన మొదలయ్యాక… రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. తాజాగా ఆ ప్రాజెక్టులన్నీ ఒకదాని తర్వాత మరొకటి అన్నట్లుగా ప్రారంభమైపోతున్నాయి. ఇందులో భాగంగా తిరుపతిలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ప్రారంభమైపోయింది. హీరో ఫూచర్స్ ఎనర్జీస్ సంస్థ ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాజెక్టును టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సోమవారం అమరావతి నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు కూడా పాలుపంచుకున్నారు.
ఈ ప్రాజెక్టుతో తిరుపతి యువతకు 2 వేల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాకుండా ఏడాదికి 25 టన్నుల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి కానుంది. ఈ ప్రాజెక్టు గురించి చంద్రబాబు స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాల్లో పూర్తి వివరాలను పొందుపరిచారు. దేశంలో క్లీన్ ఎనర్జీ రంగం దిశగా పడుతున్న తొలి అడుగుల్లో భాగంగా తిరుపతిలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ను ప్రారంభించానని ఆయన తెలిపారు. రాక్ మన్ ఇండస్ట్రీస్ తో కలిసి హీరో ఫూచర్స్ ఎనర్జీస్ ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తోందని ఆయన వివరించారు. ఈ ప్లాంట్ తో ఉత్పత్తి రంగం రూపురేఖలే మారిపోనున్నాయని కూడా ఆయన తెలిపారు. ఈ తరహా ప్లాంట్లతో గాజు, ఉక్కు, పెట్రో కెమికల్స్, కెమికల్ కంపెనీలు పెద్దగా ఖర్చు లేకుండానే ఈ కొత్త సాంకేతికతను అందిపుచ్చుకునే అవకాశాలు ఉన్నాయని వివరించారు.
స్వర్ణాంధ్ర విజయ్ 2047 లక్ష్యాల్లో భాగంగా కొత్తగా రూపొందించిన ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 ఆధారంగా ఈ ప్లాంట్ ఏర్పాటు జరిగిందని చంద్రబాబు తెలిపారు. రానున్న ఐదేళ్లలో దేశంలో 160 గిగా వాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో ఈ ప్లాంట్ ఓ కీలక అడుగుగా ఆయన అభివర్ణించారు. ఈ రంగంలో రానున్న ఐదేళ్లలో 10 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడుల దిశగా కేంద్రం రూపొందించిన ప్రణాళికలోనూ ఇదో కీలక అడుగుగా ఆయన చెప్పుకొచ్చారు. ఏపీకి ఉన్న అపార తీరప్రాంతం పోర్టులు, పారిశ్రామిక అనుకూల విధానాల కారణంగా ఈ రంగంలో రాష్ట్రం ఓ గ్లోబల్ లీడర్ గా అవతరించనుందని కూడా చంద్రబాబు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా హీరో ఫూచర్స్ ఎనర్జీస్, రాక్ మన్ ఇండస్ట్రీస్ ప్రతినిధులను ఆయన ఘనంగా సత్కరించారు.