టీపీసీసీ ప‌ద‌వులు: సంప్ర‌దాయానికి భిన్నంగా న‌ట‌రాజ‌న్ అడుగులు!

రాజ‌కీయాల్లో సాధార‌ణంగా.. విధేయుల‌కు వీర‌తాళ్లు వేస్తారు. నాయ‌కుల‌ను మెచ్చుకునేవారిని.. పొగిడే వారికి.. వారికి అన్ని విధాలా స‌హ‌క‌రించేవారికి రాజ‌కీయాల్లో ప‌దవులు ద‌క్క‌డం కామ‌నే. పైగా.. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ‌కాలంగా ఇదే సంప్ర‌దాయం కొన‌సాగుతోంది. దీంతో న‌చ్చిన నాయ‌కుడుకి మెచ్చి మ‌రీ విధేయులుగా ఉండ‌డం కామ‌న్ అయిపోయింది. దీంతో ప‌ద‌వులు దండిగా వ‌చ్చి వాల‌డం కూడా.. కామ‌న్‌గా మారింది. ఈ సంప్ర‌దాయం ప్ర‌కార‌మే.. ఇటీవ‌ల తెలంగాణ‌లో పీసీసీ ప‌ద‌వులు రెడీ అయ్యారు.

ఒక్క పీసీసీలోనే కాకుండా.. దాదాపు 200 నామినేటెడ్ ప‌ద‌వుల‌కు కూడా ఎంపిక పూర్త‌య్యింద‌న్న టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చారు. సీఎం వ‌ద్ద‌కు చేర‌లేద‌న్న మాటే కానీ.. మంత్రులు స‌హా వివిధ ద‌శ‌ల్లో వీరి వ‌డ‌బోత‌.. జ‌రిగింది. అన్ని లాఛ‌నాలు పూర్తి చేసుకుని నేడో రేపో ఆమోద ముద్ర ప‌డితే.. స‌ద‌రు నాయ‌కులు పద‌వుల కుర్చీలు ఎక్క‌నున్నారు. కానీ, ఇంత‌లోనే మారిన ఇంచార్జ్ కార‌ణంగా.. ఈ ప‌ద‌వుల జాబితాలు స‌మ‌సి పోయాయి. వీరి ఆశ‌ల‌పై పార్టీ నీళ్లు జ‌ల్లింది.

ఈ నేప‌థ్యంలో తాజాగా పీసీసీ ప‌ద‌వులు స‌హా.. నామినేటెడ్ కుర్చీల‌కు నాయ‌కుల‌ను ఎన్నుకునే క్ర‌తువు ను ప్రారంభించారు. దీని ప్ర‌కారం.. ప‌నిచేసే నాయ‌కుడు, ప్ర‌జ‌ల‌కోసం, పార్టీ కోసం వ‌ళ్లు వంచే నాయ‌కుల కు మాత్ర‌మే ప‌ద‌వులు ఇవ్వాల‌ని మీనాక్షి న‌ట‌రాజ‌న్ చెప్పుకొచ్చారు. త‌ద్వారా.. పార్టీలో కీల‌క‌మైన క్షేత్ర‌స్థా యి నాయ‌కుల‌కు గుర్తింపు ద‌క్కుతుంద‌న్న దూర దృష్టి స్ప‌ష్టంగా క‌నిపించింది. నిజానికి కొన్ని ద‌శాబ్దాలు గా.. స‌రైన గుర్తింపు రాని/ లేని నాయ‌కులు చాలా మంది ఉన్నారు.

ఇప్పుడు వీరికి అవ‌కాశం ద‌క్కే చాన్స్ క‌నిపిస్తోంది. అదేస‌మ‌యంలో బంధువర్గాలు, కుటుంబాలు.. వంటి జాడ్యానికి కూడా మీనాక్షి.. బ్రేకులు వేసే అవ‌కాశం ఉంది. అయితే.. ఈ క్ర‌మంలో అంతే బ‌ల‌మైన నాయకుల‌ను దాటుకుని.. ఈ నిర్ణ‌యాలు స‌ఫ‌లం కావాల్సి ఉంటుంది. అది ఎంత వ‌ర‌కు సాధ్య‌మో చూడాలి. ఏదేమైనా.. విధేయుల‌ను ప‌క్క‌న పెట్టి.. ప‌ని చేసేవారికి.. క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌య్యే వారికి అవ‌కాశం ఇచ్చే సంస్కృతి తొలిసారి కాంగ్రెస్‌లో తెర‌మీదికి రావ‌డం గ‌మ‌నార్హం.