తెలుగు దేశం పార్టీ… దేశంలోనే ఏ ఒక్క రాజకీయ పార్టీకి సాధ్యం కాని విజయాన్ని నమోదు చేసిన పార్టీ. ప్రస్థానం మొదలుపెట్టిన 9 నెల్లలోనే అధికారంలోకి వచ్చిన పార్టీ. దేశానికి రూ2లకే కిలో బియ్యాన్ని పరిచయం చేసిన పార్టీ. కాంగ్రెస్ గుత్తాధిపత్యాన్ని తూట్లు పొడుస్తూ జాతీయ స్థాయిలో కూటమికి శ్రీకారం చుట్టిన పార్టీ. ఇప్పుడు కూడా ఎన్డీఏకు హ్యాట్రిక్ పవర్ అందించిన పార్టీ. ఇలా చెప్పుకుంటూ పోతే…టీడీపీ ప్రత్యేకతల జాబితా ఇలా చాంతాడంత ఉంటుంది.
సరే.. అసలు విషయం ఏమిటంటారా? ఏమీ లేదండి… టీడీపీ బలం ఏమిటో ఆ పార్టీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఒక్కటంటే ఒక్క ముక్కలో చెప్పేశారు. తన సొంత జిల్లా చిత్తూరులోని గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలోని రామానాయుడుపల్లెలో శనివారం పర్యటించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సామాజిక పింఛన్ల పంపిణీలో పాలుపంచుకునేందుకు శనివారం ఆ గ్రామానికి వచ్చిన చంద్రబాబు… లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారితో మమేకమయ్యారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా పార్టీ గురించి మాట్లాడిన చంద్రబాబు..టీడీపీని ఓడించడం ఏ ఒక్కరికీ సాధ్యం కాదని తెలిపారు. టీడీపిని ఓడించడం ఏ పార్టీకి సాధ్యం కాదన్నారు. ఒకవేళ టీడీపీ ఓడిందంటే… దానికి ఒకే ఒక్క కారణం ఉంటుందని ఆయన తెలిపారు. అదేంటంటే… టీడీపీ కార్యకర్తలు అసంతృప్తితో ఓటు వేయకుండా ఇంటిలో పడుకుంటేనే టీడీపీ ఓడిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యకర్తలు పార్టీని వీడి పక్కకు వెళ్లే వారు కాదన్న చంద్రబాబు… పార్టీ కార్యకర్తల దగ్గర పసుపు రక్తం తప్ప వేరేది లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వయంగా చంద్రబాబు నోట నుంచి ఈ తరహా వ్యాఖ్యలు వినిపించినంతనే పార్టీ శ్రేణులు కేరింతలు కొట్టాయి.