చేరిన వాళ్ళ కన్నా సస్పెండ్ అయిన నేతలే ఎక్కువా ?

రాష్ట్ర బీజేపీలో విచిత్రమైన పరిస్దితులు కనబడుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న కారణంగా రాష్ట్ర బిజేపీలో చాలామంది ఇతర పార్టీల నుండి వచ్చి చేరిపోతారని మొదట్లో కమలనాధులు అనుకున్నారు. అయితే కేంద్రంలో అధికారం విషయాన్ని పక్కనపెట్టేస్తే రాష్ట్రంలో మాత్రం పార్టీ ఏమాత్రం బలపడలేదన్న విషయం తెలిసిపోతోంది. ఎందుకంటే కేంద్రంలో ఇంకా ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నా రాష్ట్రంలో మాత్రం కనీసం గట్టి ప్రతిపక్షంగా కూడా ఎదగలేదనే అనుమానాలుండటమే ప్రధాన కారణం.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గడచిన మూడు మాసాల్లో ఆరుగురు నేతలను పార్టీ నాయకత్వం సస్పెండ్ చేసింది. పార్టీ లైన్ దాటి స్వతంత్రంగా మాట్లాడుతున్నారనే కారణంగా వీరందరిపై సస్పెన్షన్ వేటు వేసింది పార్టీ. సస్పెండ్ అయిన నేతల్లో టీడీపీ నుండి కమలం పార్టీలో చేరిన వాళ్ళే ఎక్కువున్నారు. అదే సమయంలో బీజేపీలో దశాబ్దాలుగా పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు.

పార్టీ లైనంటే ప్రధానంగా అమరావతి ఇష్యూనే వస్తోంది. కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షునిగా ఉన్నంత కాలం నేతలను ఓ కారణంతో సస్పెండ్ చేస్తే సోము వీర్రాజు బాధ్యతలు తీసుకున్న తర్వాత మరో కారణంగా సస్పెండ్ అవుతున్నారు. పార్టీతో దాదాపు నాలుగు దశాబ్దాల అనుబంధం ఉన్న కుమారరాజను కన్నా సస్పెండ్ చేశారు. ఎందుకు సస్పెండ్ చేశారంటే అనుమతి లేకుండానే టీవీ చర్చల్లో పాల్గొన్నారని.

ఇక సోము అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వెలగపూడి గోపాలకృష్ణ, రామకోటయ్యలను సస్పెండ్ చేశారు. ఎందుకంటే అమరావతిపై పార్టీలైనుకు భిన్నంగా మాట్లాడినందుకట. అలాగే తాజాగా లంకా దినకర్ ను కూడా పార్టీ నుండి వీర్రాజు సస్పెండ్ చేసేశారు. ఎందుకంటే పార్టీ వద్దన్నా టీవీ చర్చల్లో పాల్గొన్నారనే కారణం చెబుతున్నారు. ఒక్క కుమారరాజా తప్ప మిగిలిన వాళ్ళపైన టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఇదే సమయంలో టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన మాజీ ఎంఎల్ఏ వరదాపురం సూరి, అన్నం సతీష్ లాంటి వాళ్ళ గొంతులే ఎక్కడా వినబడటం లేదు. టీడీపీ నుండి బిజేపీలో చేరిన నేతల్లో చందు సాంబశివరావు మాత్రమే టీవీ చర్చల్లో తరచూ కనబడుతున్నారు. మొత్తం మీద బీజేపీలో చేరిన నేతలకన్నా సస్పెండ్ అయి బయటకు వెళ్ళిపోయిన నేతల సంఖ్యే ఎక్కువగా ఉందని పార్టీలో జోకులేసుకుంటున్నారు.