ప్రవీణ్ ఆదిత్యకు ఫైబర్ నెట్ పగ్గాలు

అటు జీవీ రెడ్డి, ఇటు ఐఏఎస్ అధికారి దినేశ్ కుమార్ పంతాలు, పట్టింపుల కారణంగా పెను వివాదానికి కేంద్రంగా మారిన ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ దిద్దుబాటులో భాగంగా రెండో దశ చర్యలకు తొలి అడుగు పడింది. ఇప్పటికే సంస్థను వివాదంలోకి నెట్టిన జీవీ రెడ్డి సంస్థ చైర్మన్ పదవికి రాజీనామా చేయగా… తన వంతు ఆజ్యం పోసిన దినేశ్ ను చంద్రబాబు సర్కారు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. దినేశ్ కుమార్ బదిలీ జరిగి ఒక్క రోజు కూడా గడవకుండానే.. ఆ సంస్థకు నూతన అధికారిని ఎండీగా నియమించారు.

యువ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ఆదిత్య సీవీ ని ఫైబర్ నెట్ కార్పొరేషన్ నూతన ఎండీగా నియమితులు అయ్యారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రానికే ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రవీణ్ ఆదిత్యను రెగ్యులర్ ఎండీగా కాకుండా ఇంచార్జీ ఎండీగా నియమించింది. అంతేకాకుండా ఫైబర్ ఎండీ హోదాలో దినేశ్ కుమార్ నేతృత్వం వహించిన రియల్ టైం గవర్నెన్స్ సీఈఓగా, గ్యాస్, డ్రోన్ కార్పోరేషన్ల ఎండీగానూ ప్రవీణ్ కు బాధ్యతలు అప్పగించారు.

ప్రస్తుతం ప్రవీణ్ ఆదిత్య…ఏపీ మారిటైం బోర్డు సీఈఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. 2016 ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన ఆదిత్య తమిళనాడులోని కోయంబత్తూరు ఇన్ స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ పట్టా సాధించారు. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరైన ఆయన మంచి ర్యాంకు సాధించి.. ఐఏఎస్ కేడర్ కు ఎంపికయ్యారు. సివిల్ సర్వీసెస్ లో చేరిన తర్వాతే ప్రవీణ్… కేరళ కేడర్ ఐఏఎస్ కు చెందిన ఇలాకియాను వివాహం చేసుకున్నారు. ప్రవీణ్ తో వివాహం తర్వాత ఇలాకియాను కేంద్రం కేరళ కేడర్ నుంచి ఏపీ కేడర్ కు బదిలీ చేసింది.