బీఆర్ఎస్ కు ఇచ్చి పడేసిన రేవంత్

తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయంటూ సాగుతున్న ఉహాగానాలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా రాని ఉప ఎన్నికలు ఇప్పుడెందుకు వస్తాయంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు నాటి బీఆర్ఎస్ హయాంలో జరిగిన పార్టీ ఫిరాయింపులను ప్రస్తావిస్తూ రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్లపై ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో ఆ తర్వాత 10 మంది బీఆర్ఎస్ ను వీడి అధికార కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. వీరిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. స్పీకర్ సకాలంలో స్పందించడం లేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

ఈ పిటిషన్లపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం మరోమారు ఈ పిటిషన్లపై విచారణ జరపనుంది. ఈ విషయంపై సుప్రీంకోర్టులో విచారణ జరగడానికి ఒక రోజు ముందు రేవంత్ రెడ్డి బహిరంగ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మంగళవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించిన రేవంత్… నాడు రాని ఉప ఎన్నికలు ఇప్పుడు ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. నాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. విపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ఎమ్మెల్యేలను లాగేసుకోలేదా? అని కూడా రేవంత్ ప్రశ్నించారు. నాడు బీఆర్ఎస్ చేస్తే తప్పు కానిది.. నేడు బీఆర్ఎస్ టికెట్లపై గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారితే తప్పు అవుతుందా? అని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సాధారణంగా పార్టీ ఫిరాయింపులపై కీలక నేతలు అంతగా స్పందించిన దాఖలాలు లేవు. అంతేకాకుండా సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న ఇలాంటి అంశాలపై అసలే స్పందించిన దాఖలాలు లేవు. అయితే అందుకు భిన్నంగా రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం మంచిర్యాల, నిజామాబాద్ లలో నిర్వహించిన బహిరంగ సభల్లో రేవంత్ పాలుపంచుకున్నారు ఈ సందర్భంగానే రేవంత్ పార్టీ ఫిరాయింపులపై ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అటు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు బీఆర్ఎస్ లోనూ ఆసక్తికర చర్చకు తెర లేసింది.