రంగంలోకి లోకేష్.. టీడీపీలో కొత్త జోష్‌!

పార్టీ అధినేత బ‌య‌ట‌కు రావ‌డం లేదు. క‌నీసం చిన్న‌బాబైనా వ‌స్తే.. మా త‌డాఖా ఏంటో చూపిస్తాం! అన్న టీడీపీ సీనియ‌ర్ల‌కు ఆ స‌మ‌యం వ‌చ్చేసింది. పార్టీ అధినేత చంద్ర‌బాబు బ‌య‌ట‌కు రాక‌పోయినా.. ఆయ‌న కుమారుడు, భావి టీడీపీ అధ్య‌క్షుడు నారా లోకేష్ బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డుతున్నారు. వ‌ర‌ద ప్ర‌భావిత జిల్లాలను వ‌రుస పెట్టి సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. రైతుల‌ను నేరుగా క‌లుస్తున్నారు. మోకాల్లోతు నీటిలో కూడా నిర్భ‌యంగా దిగుతూ.. పొలాల‌ను సంద‌ర్శిస్తున్నారు. నిండా మునిగిన రైతుల కంట త‌డి తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

సో… ఇదే క‌దా టీడీపీ నేత‌లు కోరుకున్నారు. ఇప్పుడు వారు అనుకున్న‌దే జ‌రుగుతోంది. దీంతో టీడీపీ నేత‌ల్లో హుషారు క‌నిపిస్తోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు హైద‌రాబాద్‌కే ప‌రిమితమై.. ట్విట్ట‌ర్ లో స‌టైర్లు పేల్చిన చిన్న‌బాబు నేడు కార్య‌రంగంలోకి నేరుగా దూకారు. ఇది.. పార్టీకి రెండు విధాలా లాభం చేకూరుస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక‌టి.. పార్టీలో నెల‌కొన్న నైరాశ్యాన్ని త‌గ్గిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు చెల్లాచెదురుగా ఉన్న నాయ‌కుల‌ను కూడా ఏక‌తాటిపైకి తెస్తోంది. నిజానికి హైద‌రాబాద్‌లో ఉన్న‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు రాష్ట్ర పాల‌న‌లోని లోపాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు దృష్టి పెడుతూనే ఉన్నారు. క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌పంచ స్థాయి వైద్యుల‌తో ఆయ‌న జూమ్ యాప్ ద్వారా సూచ‌న‌లు స‌ల‌హాలు ఇప్పించారు.

అదేస‌మ‌యంలో ప్ర‌భుత్వంలోని లోపాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఎండ‌గడుతున్నారు. పార్టీలో జిల్లాస్థాయి నుంచి మండ‌ల స్థాయి వ‌ర‌కు నేత‌ల‌తో రోజూ స‌మీక్ష‌లు చేశారు. ఈ ప‌రిణామాల‌తో పార్టీలో ఊపు తెచ్చేందుకు ప్ర‌య‌త్నించారు. అయిన‌ప్ప‌టికీ.. బాబు అక్క‌డ తమ్ముళ్లు ఇక్క‌డ‌.. అనే కామెంట్లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలోనే నేరుగా చిన్న‌బాబును రంగంలోకి దింపారు. తాజాగా ఆయ‌న గ‌డిచిన రెండు మూడు రోజులుగా వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. రైతుల గోడు వింటున్నారు. వ‌ర‌ద‌లో చిక్కుకుని స‌ర్వ‌స్వం కోల్పోయిన ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు.

నిన్న‌టికి నిన్న‌ అనంత‌పురం జిల్లాలో రైతుల‌ను ఓదార్చేందుకు వెళ్లారు. పొలాల్లోకి నేరుగా దిగిపోయారు. నీట మునిగిన పంట‌ను చేతితో ప‌ట్టుకుని ప‌రిస్థితిని అక్క‌డిక‌క్క‌డే స‌మీక్షించారు. లోకేష్ రాక‌తో.. అనంత‌పురం టీడీపీలో పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంది. జిల్లాలో టీడీపీ నేత‌లంతా క్యూకట్టుకుని లోకేష్ చుట్టూ చేరిపోయారు. ఆయ‌న వెంటే ఉన్నారు. ఆయ‌నకు అన్ని విధాలా స‌హ‌క‌రించారు. లోకేష్ నాయ‌క‌త్వానికి జై కొట్టారు.

ఈ ప‌రిణామంతో జిల్లా టీడీపీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న స్త‌బ్ద‌త వాతావ‌ర‌ణం పూర్తిగా తొలిగిపోయిన‌ట్టేన‌ని.. పార్టీ పుంజుకుంద‌ని.. ఇక‌పైకార్య‌క్ర‌మాలు పుంజుకుంటాయ‌ని ఇక్క‌డి నేత‌లు చెబుతున్నారు. మ‌రీ ముఖ్యంగా యువ నేత‌లు లోకేష్ వెంటే ఉండ‌డంతో రాబోయే రోజుల్లో యువ‌త పార్టిసిపేష‌న్ పెరుగుతుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఏదేమైనా.. లోకేష్ శ‌కం ప్రారంభ‌మైంద‌న‌డానికి ఇదే ఉదాహ‌ర‌ణ‌గా పేర్కొంటున్నారు.