అసెంబ్లీకి వచ్చినా… బీఏసీకి డుమ్మా కొట్టిన వైసీపీ

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వస్తామంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించి… అందరిలో ఆసక్తి రేకెత్తించారు. అయితే మాట చెప్పిన ప్రకారం అసెంబ్లీ సమావేశాలకు తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి వచ్చిన జగన్… పట్టుమని పది నిమిషాలు కూడా సభలో ఉండలేదు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగంలో గత ప్రభుత్వ హయాంలో విధ్వంసం జరిగిందని చెప్పినంతనే.. నిరసన వ్యక్తం చేసిన వైసీపీ సభ్యులు… కాసేపటికే గవర్నర్ ప్రతులను చించివేసి సభ నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడిన శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ… అసెంబ్లీలో వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చి తీరాల్సిందేనని… లేదంటే గతంలో జగన్ చెప్పినట్టుగా మీడియా ముందే ప్రజా సమస్యలను ప్రస్తావిస్తామని వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే.. గవర్నర్ తమ పార్టీ ప్రభుత్వంపై ఏవో విమర్శలు చేశారన్న కారణంతో సోమవారం నాటి అసెంబ్లీ సమావేశాలను బాయికాట్ చేసిన వైసీపీ… బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశానికి కూడా డుమ్మా కొట్టింది. అసెంబ్లీ, మండలి సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి?.. ఏఏ అంశాలపై చర్చ జరగాలి? అన్న విషయాలపై నిర్ణయం తీసుకునే ఈ కమిటీ సమావేశం అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి నిబంధనల మేరకు సభలో ప్రాతినిధ్యం ఉన్న అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరు కావాల్సి ఉంది. అందులో భాగంగానే సభాధ్యకుడి హోదాలో సీఎం నారా చంద్రబాబునాయుడు, టీడీపీ తరఫున మంత్రి పయ్యావుల కేశవ్, చీఫ్ విప్ హోదాలో జీవీ ఆంజనేయులు, జనసేన తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ తరఫున ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ విష్ణు కుమార్ రాజులు హాజరయ్యారు.ఈ భేటీలో సభను 15 రోజుల పాటు కొనసాగించాలని బీఏసీ తీర్మానించింది. 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలంటే… సెలవు దినాలను తీసివేయగా… మార్చి 19 వరకు సభను నిర్వమించాలని కమిటీ నిర్ణయించింది. అవసరమైతే మరో రెండు రోజుల పాటు సభను పొడిగించాలని కూడా ఈ సమావేశం నిర్ణయించింది.

ఇదిలా ఉంటే… అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నామని చెప్పిన జగన్… సభకు అయితే వచ్చారు గానీ… కీలకమైన బీఏసీ సమావేశానికి మాత్రం గైర్హాజరు అయ్యారు. ఒకవేళ బీఏసీ సమావేశానికి తాను వెళ్లకున్నా… తన పార్టీ తరఫున అయినా ఎవరినో ఒకరిని పంపేందుకు కూడా ఆయన ఇష్టపడలేదు. బీఏసీ సమావేశం జరుగుతున్న సమయంలో జగన్ అసెంబ్లీ ప్రాంగణంలోనే తన పార్టీకి కేటాయించిన గదిలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. మున్ముందు సభలో ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న అంశంపై ఆయన తన పార్టీ నేతలతో చర్చల్లో మునిగిపోయారు. అయినా ఇకపైనా సభకు రావాలన్న ఉద్దేశమే ఉంటే.. బీఏసీ సమావేశానికి హాజరై… మరిన్ని రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలనో, లేదంటే… ఫలానా అంశంపై కీలక చర్చ జరగాలనో అధికార పక్షం ముందు ప్రతిపాదనలు పెట్టే వారు కదా… ఏదో మాట అన్నాం… సభకు వచ్చాం… అన్నట్టుగా జగన్ వ్వవహరించారన్న వాదనలు అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి. మంగళవారం సభ సమావేశమైతే తప్పించి వైసీపీ ఈ సమావేశాలకు పూర్తి స్థాయిలో హాజరు అవుతుందా?.. లేదంటే తొలి రోజు అటెండెన్స్ తోనే సరిపెడుతుందా? అన్నది తేలుతుందన్న వాదన వినిపిస్తోంది.