టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు జనానికి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. ఇప్పటికే పింఛన్ల మొత్తాలను పెంచిన చంద్రబాబు… ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి ఎప్పుడో శ్రీకారం చుట్టారు. విద్యుత్ చార్జీలను పెంచేది లేదని చెప్పిన మాటను కూడా చంద్రబాబు సర్కారు రెండు రోజుల క్రితమే అమలు చేసి చూపింది. తాజాగా పట్టణ ప్రాంత ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన చెత్త పన్ను వసూళ్లను పూర్తిగా నిలిపివేస్తూ బాబు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం అధికార ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో ఇకపై ఏపీలో చెత్త పన్ను మాటే వినిపించదు.
వైసీపీ అధికారంలో ఉండగా… పట్ఠణాలు, నగరాలు, చివరాఖరుకు నగర పంచాయతీల్లోనూ చెత్త పన్నును వసూలు చేయాలని నాటి జగన్ సర్కారు తీర్మానించింది. ఆ మేరకు తక్షణమే చెత్త పన్ను వసూలుకు ఆదేశాలు జారీ చేసిన నాటి ప్రభుత్వం ప్రజల నుంచి చెత్త పన్నును ముక్కు పిండి మరీ వసూలు చేసింది. చెత్త పన్ను వసూలుపై నాడు విపక్షాలన్నీ గగ్గోలు పెట్టాయి. చెత్త పన్ను వసూలు ఏమిటి అంటూ నాడు విపక్షాలతో పాటుగా ప్రజా సంఘాలు కూడా నిరసన గళం విప్పాయి. అయినా కూడా జగన్ సర్కారు వెనక్కు తగ్గలేదు. కేంద్రం నుంచి ప్రోత్సాహకాలు వస్తాయంటూ చెప్పిన వైసీపీ ప్రభుత్వం చెత్త పన్ను వసూలుపై వెనడుగు వేయలేదు.
ఇక మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు సాగించిన చంద్రబాబు… తాము అధికారంలోకి వస్తే చెత్త పన్నును రద్దు చేస్తామని ప్రకటించారు. అయినా చెత్త సేకరణ కోసం చెత్త పన్ను ఏమిటి?.. ఇదో చెత్త నిర్ణయం అంటూ టీడీపీతో పాటు కూటమి పార్టీలు వైసీపీ నిర్ణయాన్ని ఎద్దేవా చేశాయి. చంద్రబాబు అనుకున్నట్టుగానే కూటమికి ప్రజలు ఎన్నికల్లో బ్రహ్మ రథం పట్టారు. దీంతో చెత్త పన్ను రద్దుపై ఆాలోచన చేసిన చంద్రబాబు సర్కారు… డిసెంబర్ 31 నుంచి చెత్త పన్ను వసూలును నిలిపివేసింది. తాజాగా ఆ నిర్ణయానికి అనుగుణంగా మునిసిపల్ చట్టాన్ని సరవిస్తూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ఫలితంగా ఏపీలో చెత్త పన్ను అన్న మాట వినిపించదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates