టాలీవుడ్ యువ నటుడు, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ సోమవారం రాత్రి వేళ పోలీస్ స్టేషన్ లో కనిపించిన వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది. తండ్రి మోహన్ బాబు, సోదరుడు మంచు విష్ణులతో నెలకొన్న ఆస్తి వివాదంలో మనోజ్ ఒంటరి పోరు సాగిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ శివారు ప్రాంతం జల్ పల్లిలో మోహన్ బాబు ఏర్పాటు చేసుకున్న ఫామ్ హౌస్ విషయంలో నెలకొన్న వివాదం పెను కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వివాదం చిలికిచిలికి గాలి వానలా మారగా… మనోజ్, విష్ణులు ఏర్పాటు చేసుకున్న బౌన్సర్ల మధ్య పరస్పరం దాడులు కూడా జరిగాయి. ఈ వివాదంలోనే జర్నలిస్టుపై దాడి చేసిన మోహన్ బాబు ఇటీవలే సుప్రీంకోర్టు బెయిల్ తో ఊపిరి పీల్చుకున్నారు.
ప్రస్తుతానికి జల్ పల్లి వివాదానికి సంబంధించి రెవెన్యూ అధికారులు విచారణ జరుపుతుండగా… మనోజ్ తిరుపతికి షిఫ్ట్ అయిపోయాడు. సంక్రాంతి పండగకు అంటూ మోహన్ బాబు, విష్ణులు కూడా తిరుపతి సమీపంలోని తమ సొంతూరు రంగంపేటకు చేరారు. రంగంపేట సమీపంలో శ్రీ విద్యానికేతన్ పేరిట మోహన్ బాబు ఓ ఇంటర్నేషనల్ స్థాయి స్కూల్ ను నడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనిని మోహన్ బాబు వర్సిటీ అని కూడా పిలుస్తున్నారు. ఇప్పుడు మోహన్ బాబు ఫ్యామిలీలో నెలకొన్న ఆస్తుల పంచాయతీ… జల్ పల్లి నుంచి మోహన్ బాబు వర్సిటీకి షిఫ్ట్ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి మనోజ్ తిరుపతి సమీపంలోని భాకరాపేట పోలీస్ స్టేషన్ లో కనిపించారు. ఈ ఫొటోలు చూసినంతనే మనోజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారా? అంటూ అంతా ఆశ్యర్యానికి గురయ్యారు.
అయితే ఈ ఘటన వివరాల్లోకి వెళితే,.. పోలీసులేమీ మనోజ్ ను అరెస్ట్ చేయలేదట. మనోజే భాకరాపేట పోలీస్ స్టేషన్ కు వెళ్లి రచ్చరచ్చ చేశారట. భాకరాపేట పీఎస్ లిమిట్స్ లోని ఓ రిసార్ట్ లో మనోజ్ ఉంటున్నారట. మనోజ్ వెంట బౌన్సర్లూ ఉన్నారట. రాత్రి వేళ గస్తీకి వెళ్లిన పోలీసులకు అనుమానాస్పదంగా తిరుగుతున్న బౌన్సర్లు కనిపించగా… వారిని పోలీసులు ఆరా తీశారట. ఈ విషయం తెలుసుకున్న మనోజ్ పోలీసులపై ఓ రేంజిలో ఫైరయ్యి తన బౌన్సర్లనే ఆరా తీస్తారా? తననే అవమానిస్తారా? అంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి మరీ నిరసనకు దిగారట. ఉన్నతాధికారులు వచ్చి తనకు సమాధానం చెబితే తప్పించి అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారట. ఈ క్రమంలో ఆయన అక్కడ రాత్రి 11 గంటల నుంచి 1 గంట దాకా పోలీస్ స్టేషన్ మెట్ల మీదే కూర్చున్నారట. దీంతో పోలీసు ఉన్నతాధికారులు వచ్చి ఆయనకు సర్దిచెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారట.