వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ హయాంలో జరిగిన దాడి ఘటనలో వంశీ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే చాలా మంది అరెస్ట్ అయినా… అరెస్ట్ ముప్పు నుంచి రక్షణ పొందుతూ వంశీ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు.
అయినా కూడా ఈ కేసు తనకు ఎప్పుడైనా ముప్పేనని భావించిన వంశీ… ఏకంగా ఆ కేసునే కొట్టివేయించుకుంటే సరిపోలా? అన్న దిశగా సాగారు. ఈ యత్నాలే వంశీని కటకటాల వెనక్కి పంపాయని చెప్పక తప్పదు.
ఈ కేసులో ప్రధాన ఫిర్యాదుదారుడిగా ఉన్న టీడీపీ గన్నవరం కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ ముదునూరి సత్యవర్ధన్ ను వంశీ అండ్ కో ట్రాప్ చేసింది. కేసును వాపస్ తీసుకునేలా అతడిని ఒప్పంచేందుకు వంశీ వ్యూహం రచించారు. ఆ వ్యూహంలో భాగంగానే సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన వంశీ అనుచరులు… కేసును వాపస్ తీసుకోవాలని బెదిరించారట. తాము చెప్పినట్లు చేయకుంటే చంపేస్తామని కూడా అతడిని వారు బెదిరించారట.
అంతేకాకుండా తాము చెప్పినట్లు వింటే… రూ.40 లక్షలు నజరానాగా ఇస్తామని ప్రలోభపెట్టారట. ఓ వైపు మాట వినకుంటే ప్రాణాలు తీస్తామనే బెదిరింపులు… మరోవైపు మాట వింటే రూ.40 లక్షల నజరానా… సత్యవర్ధన్ వారి మాట వినేలా చేసిందని తేలింది. రూ.40 లక్షలకు ఒప్పందం కుదిరితే… అందులో రూ.20 వేలను సత్యవర్థన్ చేతిలో అడ్వాన్స్ రూపేణా పెట్టిన వంశీ అండ్ కో మిగతా మొత్తం పని అయ్యాక ఇస్తామని చెప్పారట.
ఈ క్రమంలో వంశీ అండ్ కో చెప్పినట్లుగా ఇటీవలే ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టుకు వెళ్లిన సత్యవర్ధన్…తాను పెట్టిన కేసును ఉపసంహరించుకుంటానని న్యాయమూర్తికి తెలిపాడు. దీంతో ఒకింత ఆశ్చర్యానికి గురైన న్యాయమూర్తి… కేసు ఉపసంహరించుకుంటానని మాట చెబితే సరిపోదని, స్టేట్ మెంట్ ఇవ్వగలరా? అంటూ ప్రశ్నించారట. అసలే అక్కడ రూ.40 లక్షల నజరానా ఊరిస్తుంటే… ముందూ వెనుకా ఆలోచించకుండా స్టేట్ మెంట్ ఇచ్చేందుకు తాను సిద్ధమేనని సత్యవర్ధన్ తెలిపాడు.
ఆపై అన్నీ చకచకా జరిగిపోయాయి. తాము చెప్పిన మాట విన్న సత్యవర్ధన్ కు వంశీ అండ్ కో రూ.40 లక్షలు ఇవ్వాలి కదా. అందుకు విరుద్ధంగా అదిగో ఇదిగో అంటూ వాయిదా వేశారట. ఈలోగానే వారి కుట్ర బయటపడటంతో కథ అడ్డం తిరిగిపోయింది. అంటే… కేసు విత్ డ్రా చేసుకున్న సత్యవర్ధన్ కు రూ.40 లక్షలకు బదులుగా కేవలం రూ.20 మాత్రమే అందాయట.