జగన్ అనే నేను… మీరు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ఒప్పుకోను

భరత్ అనే నేను… సినిమాను ఏపీ సర్కారు ఫాలో అయిపోయింది. ఆ సినిమాలో హీరో ముఖ్యమంత్రి అయిన వెంటనే వాహనదారులకందరికీ పెద్ద షాక్ ఇస్తాడు. లైసెన్సు లేకుండా బండి నడిపినా, నెంబర్ ప్లేటు లేకపోయినా చివరకు రాంగ్ రూట్ లో వెళుతున్న వాళ్ళకి గూబగుయ్యిమనిపించేంతగా ఫైన్లు వేస్తాడు. అదే పద్దతిలో ఇపుడు జగన్మోహన్ రెడ్డి కూడా వాహనదారులకు భారీ ఎత్తున జరిమానాలను విధించేట్లుగా ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే అంతే సంగతులు.

ట్రాఫిక్ లో బండి నడిపేటపుడు లైసెన్సు, ఆర్సీ చెకింగ్ కు ఎవరైనా అడ్డుకుంటే రూ. 750 జరిమానా విధించేట్లుగా కొత్తగా నిబంధన విధించారు. బండికి సంబంధించిన సమాచారం ఇవ్వటానికి నిరాకరించిన వారికి కూడా రూ. 750 ఫైన్ వేస్తారు. అనుమతి లేని వారు బండి నడిపితే అంటే లైసెన్స్ లేనివాళ్ళు నడిపితే రూ. 5 వేలు ఫైన్ కట్టాల్సిందే. డ్రైవింగ్ లేని వయస్సు వాళ్ళు వాహనం నడిపినా రూ. 5 వేలు ఫైన్ కట్టాల్సిందే.

డ్రైవింగ్ లెసెన్సు పొందే వయసు అర్హత లేనివాళ్ళకు బండి ఇస్తే రూ. 10 వేలు ఫైన్ పడినట్లే. రూల్సుకు విరుద్ధంగా వాహనాలుంటే రూ 5 వేలు బ్యాండ్ పడినట్లే ఇకనుండి. అంటే కార్ల అద్దాలకు నల్లటి స్టిక్కర్ అంటించకూడదు. కానీ ఎవరైనా అంటిస్తే కచ్చితంగా ఫైన్ కట్టాల్సిందే. పరిమితికి మించి బండిని వేగంగా నడుపుతున్నపుడు పట్టుకుంటే రూ. వెయ్యి ఫైన్ పడినట్లే. ప్రమాదకరంగా కానీ సెల్ ఫోన్ లో మాట్లాడుతు డ్రైవింగ్ చేసినా రూ. 10 వేలు చమురు వదిలించుకోవాల్సిందే.

నిబంధనలకు విరుద్ధంగా బైక్, కారు రేసింగుల్లో పాల్గొంటే మొదటిసారి రూ. 5 వేలు, రెండోసారైతే రూ. 10 వేలు ఫైన్ కట్టాల్సిందే. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఫిట్ నెస్ సర్టిఫికేట్ లేకుండా పట్టుబడిన వాళ్ళు మొదటిసారైతే రూ. 2 వేలు, రెండోసారి కూడా పట్టుబడితే రూ. 5 వేలు కక్కాల్సిందే. పర్మిట్ లేకుండా వాహనాలు నడిపిన వాళ్ళకు రూ. 10 వేలు ఫైన్ పడటం ఖాయం. ఓవర్ లోడుతో వెళుతున్న వాహనాన్ని పట్టుకుంటే ముందు రూ. 20 వేలు జరిమానా+టన్నుకు రూ. 2 వేలు కట్టాల్సిందే.

వాహనం చెకింగ్ కోసం ఆపకుండా వెళ్ళిన వాహనాలను పట్టుకుంటే రూ. 40 వేలు రంగుపడినట్లే. ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వని వాళ్ళు రూ. 10 వేలు అపరాదరుసుము కట్టాల్సిందే. అవసరం లేకపోయినా అదే పనిగా హారన్ మోగించే వాళ్ళకు మొదటిసారి వెయ్యిరూపాయలు, రెండోసారి రూ.2 వేలు ఫైన్ కట్టాల్సిందే. రూల్సుకు విరుద్ధంగా వాహనాలను అమ్మిన వాళ్ళకు లేదా వాహనాలను తయారీ చేసిన వాళ్ళు లక్ష రూపాయలు ఫైన్ కట్టాల్సిందే అంటూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఒకేసారి ఇంత భారీగా జరిమానాలు విధించిందంటే బహుశా కరోనా వైరస్ కారణంగా కోల్పోయిన ఆదాయంలో కొంతైనా రాబట్టుకునేందుకే ఏమో అనిపిస్తోంది.