సినిమా ఫంక్షన్ లో వైసీపీని టార్గెట్ చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న టలీవుడ్ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్… బుధవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనను వైసీపీ శ్రేణులు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారంటూ ఆయన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు, ఫోన్ మెసేజ్ లతో వైసీపీ యాక్టివిస్టులు తనను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులకు వైసీపీ యాక్టివిస్టులపై ఫిర్యాదు చేసినట్టు ఆయన ఆ తర్వాత వెల్లడించారు.
ఈ సందర్భంగా పృథ్వీరాజ్ ఆసక్తికర కామెంట్లు చేశారు. 11 నెంబర్ వింటేనే వైసీపీ నేతలు హడలిపోతున్నారని ఆయన అన్నారు. తానేమీ వైసీపీని ఉద్దేశించి 11 నెంబరును పలకలేదని తెలిపారు. తానేదో ఓ క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్లిన సందర్భంగా ఈ నెంబర్ ను గుర్తు చేసుకున్నానని తెలిపారు. తాను మద్దతు పలికిన క్రికెట్ జట్టులోని 11 మంది క్రీడాకారుడు మంచిగా ఆడారని కూడా ఆయన అన్నారు. అయినా వైసీపీని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయాలంటే తనకు సినిమా ఈవెంట్లు అవసరం లేదని, వేరే వేదికల మీదే ఆ వ్యాఖ్యలు చేయగలనని ఆయన అన్నారు.
ఇదిలా ఉంటే… టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన సందర్భంగా పృథ్వీరాజ్… 150 గొర్రెలని, చివరలో 11 గొర్రెలే మిగిలాయని సెటైరిక్ గా మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు విన్నంతనే వైసీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. పృథ్వీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలుపెట్టాయి. ఇక విశ్వక్ సేన్ సినిమాను బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ క్రమంలో బీపీ పెరగడంతో ఆసుపత్రిలో చేరిన పృథ్వీ… ఆసుపత్రి నుంచే నేరుగా సైబర్ క్రైమ్ పోలీసుల వద్దకు వచ్చి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో కట్టిన హ్యాండ్ బ్యాండేజీలతోనే పృథ్వీ సైబర్ క్రైమ్ పోలీసుల వద్దకు వచ్చారు.