బాబును చూసి బిత్తరపోయిన మంత్రులు, అధికారులు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అమరావతిలోని సచివాలయం వేదికగా జరిగిన ఈ సమావేశంలో ఆయా శాఖలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల్లోని సమస్యలు, వాటి పరిష్కారాలపైనా చంద్రబాబు ద్రుష్టి సారించారు. గతంలోకంటే కాస్తంత భిన్నంగా సాగిన ఈ సమావేశంలో… ఆయా శాఖలకు చంద్రబాబు నిర్దేశిత లక్ష్యాలను కూడా సూచించారు.

దాదాపుగా అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులు హాజరైన ఈ సమావేశంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా అయితే.. సమావేశాలకు ముఖ్య నేతలు ఒకింత ఆలస్యంగా వస్తూ ఉంటారు. ఆలోగా అధికారులు, ఇతరత్రా సిబ్బందితో పాటుగా మంత్రులు పూర్తిగా సర్దుకునే అవకాశం ఇవ్వాలన్న దిశగా ఆలోచించే ముఖ్య నేతలు కావాలనే ఆలస్యంగా వస్తూ ఉంటారు. అయితే… సమయ పాలనలో నిక్కచ్చిగా ఉండే చంద్రబాబు అలాంటి ఫార్మాలిటీలకు దూరంగా ఉంటారు కదా. ఈ సమావేశం విషయంలోనూ చంద్రబాబు నిర్దేశిత సమయానికే సమావేశ మందిరానికి చేరుకున్నారు. అప్పటికి ఇంకా చాలా మంది మంత్రులు, అధికారులు రాలేదు.

సరే… ఎలాగూ సమావేశనికి మంత్రులు, అధికారులు రావాల్సిందే కదా. నిర్దేశిత సమయాన్ని వారికి ముందే చెప్పేశాం కదా అన్న భావనతో తన సీట్లో కూర్చున్న చంద్రబాబు… రావాల్సిన మంత్రులు, అధికారుల కోసం ఎదురు చూశారట. చంద్రబాబు వచ్చిన తర్వాత 10 నిమిషాలకు గాని మిగిలిన మంత్రులు, అధికారులు నెమ్మదిగా సమావేశ మందిరానికి చేరుకున్నారట. అయితే అప్పటికే… అక్కడకు చంద్రబాబు వచ్చి కూర్చున్న ఫైనాన్ని చూసినంతనే… మంత్రులు, అధికారులు బిత్తరపోయారట. ఎందుకంటే… సమయ పాలన పాటించని వారిపై చంద్రబాబు ఏ రీతిన కోప్పడతారన్న విషయం తెలిసిన వారంతా హడలిపోయారట. వారిలోని భయాన్ని గుర్తించిన చంద్రబాబు… ఈ సారి అయినా కాస్తంత సమయ పాలన పాటించండి అంటూ సుతిమెత్తగానే మందలించారట.