నెక్స్ట్ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిల వంతు!

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై జరగుతున్న దర్యాప్తు సంచలన పరిణామాలకు దారి తీయనుంది. అసలు తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడనే లేదు అంటూ వైసీపీ నేతలు చెబుతున్నా… సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఇటీవలే నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసింది. ఈ నలుగురు కూడా మాములు వ్యక్తులు కాదు. తిరుమలకు నెయ్యి సరఫరా చేస్తున్న సంస్థల యజమానులు. ప్రస్తుతం వీరి లింకులపై ద్రుష్టి సారించిన సిబిఐ అధికారులు.. ఆ లింకుల ఆధారంగా చర్యలకు సిద్ధం అవుతున్నారు.

సిబిఐ తీసుకునే తదుపరి చర్యల్లో భాగంగా టీటీడీ చైర్మన్ గా వ్యవహరించిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు, జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి నోటీసులు జారీ అయ్యే దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పాలి. అదే సమయంలో టీటీడీలో ఏళ్ల తరబడి తిష్ట వేసి వైసీపీ నేతలు చెప్పినట్టుగా నడుచుకున్న టీటీడీ మాజీ ఈఓ ధర్మారెడ్డికి కూడా నోటీసులు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అరెస్ట్ అయిన వారి కంపెనీలకు నెయ్యి సరఫరా కాంట్రాక్టులు ఇచ్చిన కారణంగా సుబ్బారెడ్డి, ధర్మా రెడ్డిలకు నోటీసులు జారీ కానున్నట్టు సమాచారం.

ఇదిలా ఉంటే సుబ్బారెడ్డి, ధర్మా రెడ్డిలకు నోటీసులు ఇచ్చిన తర్వాత… సదరు నోటీసులకు వారిద్దరూ ఇచ్చే సమాధానాలను ఆధారం చేసుకుని తదుపరి చర్యలకు ఉపక్రమించాలి సిబిఐ యోచిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా టీటీడీలో కీలక స్థానాల్లో పని చేస్తున్న ముగ్గురు అధికారుల అరెస్ట్ తప్పదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ అరెస్టుల తర్వాత సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిలు అరెస్ట్ అయినా ఆశ్యర్యపోవాల్సిన పని లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.