వైసీపీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి.. ఆ రెండు పదవులు వదులుకున్న విషయం తెలిసిందే. అయితే.. సాయిరెడ్డి ప్లేస్ ను ఎవరితోనూ ఇప్పటి వరకు భర్తీ చేయలేక పోయారు. సాయిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పి.. పది రోజులు దాటుతున్నా.. ఆ స్థానంలో ఇంకా ఎవరినీ ప్రకటించలేదు. ముఖ్యంగా రాజ్యసభలో వైసీపీ పక్ష నాయకుడి ప్లేస్ అత్యంత కీలకం. అదేవిధంగా పార్లమెంటరీ పార్టీని ముందుండి నడిపించే నాయకుడిగా కూడా.. సాయిరెడ్డి పేరు తెచ్చుకున్నారు.
ఢిల్లీలోనూ పెద్ద నాయకులతో కలివిడిగా ఉంటూ.. వైసీపీ వ్యవహారాలను చక్క బెట్టారు. దీంతో గడిచిన ఇన్నేళ్లలో వైసీపీ ఢిల్లీలోనూ.. రాజకీయాలు చేసింది. కానీ, సాయిరెడ్డి నిష్క్రమణ తర్వాత.. ఈ ప్లేస్ ఎవరికీ దక్కలేదు. వాస్తవానికి.. సాయిరెడ్డి ఈ బాధ్యతలు చేసినా.. ఆయనకు అదనంగా దగ్గిన సొమ్ములు కానీ.. అదనంగా అందిన జీతాలు కానీ.. ఏమీ లేదు. అయితే.. జాతీయస్థాయిలో పెద్ద ఇమేజ్ సంపాయించుకు న్నారు. వైసీపీకి గతంలో 22 మంది ఎంపీలు ఉన్నా.. ఇప్పుడు ఆ సంఖ్య తగ్గినా.. సాయిరెడ్డికి ఇమేజ్ మాత్రం పదిలంగా ఉండేందుకు.. ఆయా పదవులు కీలకం.
దీంతోనే సాయిరెడ్డి ఒక రకంగా జాతీయస్థాయిలో నెట్టుకొచ్చారు. ప్రధాని వంటి వారి దృష్టిలో కూడా పడ్డారు. కానీ, ఇప్పుడు ఆ స్థాయిలో రాజకీయాలు చేసేందుకు.. ఎవరికీ జగన్ అవకాశం ఇవ్వలేదు. అంటే.. సాయిరెడ్డి లాగా దూసుకుపోయే నాయకులు, చాతుర్యంతో మాట్లాడేవారు లేరని ఆయన సందేహిస్తున్న ట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే.. సాయిరెడ్డి ప్లేస్ కోసం.. ఎంపీ.. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు. సాయిరెడ్డి లేని లోటు తీర్చే ప్రయత్నాల్లో ఆయన ముమ్మర కసరత్తు కూడా ప్రారంభించారు.
అంటే.. సాయిరెడ్డి ప్లేస్ను తనకు ఇవ్వాలని ఆళ్ల పరోక్షంగా కోరుతున్నారు. ఆళ్లకు కూడా ఢిల్లీ స్థాయిలో ఆది నుంచి పరిచయాలు ఉన్నాయి. ఆయన కాంట్రాక్టు పనులు, రాజకీయ పరిచయాలు.. హిందీ బెల్ట్లో ఈదుకురాగల భాషానైపుణ్యం వంటివి ఉన్నాయి. కానీ, సాయిరెడ్డి లాంటి మంత్రాంగం ఆయన చేస్తారా? అన్నది సందేహం. ఈ కారణంగానే.. జగన్ ఎవరికీ సాయిరెడ్డి ప్లేస్ను అప్పగించడం లేదు. కానీ, మున్ముందు.. నిర్ణయం అయితే తీసుకోవాలి. ఆళ్ల ఈ విషయంలో తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.