శనివారం మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాలో ఒకటే రచ్చ. జనసేనకు చెందిన తిరుపతి ఇంచార్జి కిరణ్ రాయల్.. నగరానికి చెందిన ఓ మహిళతో సాగించిన వివాహేతర సంబంధం, ఆ మహిళ నుంచి ఆయన తీసుకున్న డబ్బు, బంగారం తదితరాలపై.. బాధిత మహిళ నుంచి ఓ వీడియో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చినంతనే.. ఈ వ్యవహారంపై రచ్చ మొదలైంది. ప్రత్యేకించి వైసీపీ శ్రేణులు ఈ వీడియోను క్షణాల్లో వైరల్ చేసేశారు. అంతేకాకుండా… ఈ వ్యవహారానికి సంబంధిన మరిన్ని వీడియోలు బయటకు తీస్తూ.. వాటిని సోషల్ మీడియాలో పెడుతూ సాగుతున్నారు. వెరసి నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఇదే రచ్చ సాగుతోంది.
తిరుపతికి చెందిన లక్ష్మి అనే మహిళతో కిరణ్ ఏళ్ల తరబడి వివాహేతర సంబంధాన్ని నెరిపారు. ఈ విషయాన్నీ ఇటు బాధిత మహిళతో పాటుగా అటు కిరణ్ కూడా ధృవీకరించారు. అయితే లక్ష్మి నుంచి కిరణ్ విడతలవారీగా రూ.1.20 కోట్లు తీసుకున్నారని.. ఆ సొమ్మును ఆయన తనకు తిరిగి ఇవ్వడం లేదని లక్ష్మి ఆరోపిస్తున్నారు, అయితే… అందులో కొంత మొత్తాన్ని తిరిగి ఇచ్చానని… ఇంకొంత ఇవ్వాల్సి ఉందని కిరణ్ తప్పుకున్నట్టుగా వీడియోలు చెబుతున్నాయి. ఈ మొత్తం కోసం లక్ష్మి అడగగా.. కిరణ్ ఆమెపై బెదిరింపులకు దిగారని సమాచారం. అంతేకాకుండా లక్ష్మితో సంబంధాన్ని కొనసాగిస్తూనే.. ఇంకో మహిళతో కిరణ్ సన్నిహితంగా మెలుగుతున్న వైనాన్ని తెలుసుకున్న లక్ష్మి.. ఆయనను నిలదీయడంతో ఈ వివాదం రచ్చకెక్కినట్టుగా తెలుస్తోంది. కారణం ఏదైనా… కిరణ్ ఫై సోషల్ మీడియాలో ఓ రేంజిలో రచ్చ సాగుతోంది.
మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు కిరణ్ పెద్దగా ఎవరికీ టార్గెట్ కాలేదనే చెప్పాలి. అయితే.. ఎన్నికల్లో కూటమి గెలవకపోతే… విశాఖ నుంచి తిరుపతి దాకా జగన్ ఫ్లెక్సీలు కడతానంటూ ఓ ప్రకటన చేసిన రాయల్ అందరి దృష్టిని ఆకర్షించారు. కిరణ్ చెప్పినట్టుగానే కూటమి విజయం సాధించడంతో… తిరుపతిలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు మంచి గుర్తింపు లభించింది. అదే సమయంలో వైసీపీని కిరణ్ మరింతగా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఫలితంగా వైసీపీకి కూడా కిరణ్ మూకుమ్మడిగా టార్గెట్ అయ్యారు. ఇప్పుడు ఓ మహిళతో వివాదం.. అది కూడా వివాహేతర సంభంధం, ఆపై ఆమె వద్ద భారీ ఎత్తున డబ్బు తీసుకుని బెదిరింపులకు దిగిన వీడియోలు దొరకడంతో… కిరణ్ ను వైసీపీ ఓ రేంజిలో టార్గెట్ చేసింది. ఈ వివాదం ఏ తీరానికి చేరుతుందోనన్న దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.