జగన్ కు సాయిరెడ్డి గట్టిగా ఇచ్చేశారుగా…!

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శుక్రవారం గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఆ పార్టీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇటీవలే ఎంపీ పదవితో పాటుగా… వైసీపీకి కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై గురువారం నాటి మీడియా సమావేశంలో జగన్ స్పందించారు. పార్టీని వీడిన వారు తమ క్యారెక్టర్ ను పోగొట్టుకున్నట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. ఒక్క సాయి రెడ్డికె కాకుండా పార్టీ మరీనా అందరికీ ఇదే వర్తిస్తుందని కూడా జగన్ అన్నారు.

జగన్ వ్యాఖ్యలపై సాయిరెడ్డి శుక్రవారం ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించారు. “వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువు అణువు లోను లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని మరి రాజకీయాలనే వదులుకున్నా.” అంటూ సాయిరెడ్డి ఒకింత ఘాటుగానే జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. సాయి రెడ్డి కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

వాస్తవానికి జగన్, సాయిరెడ్డి ల మధ్య మంచి సంబంధాలు కొనసాగాయి. వై ఎస్ ఫ్యామిలీతో సాయి రెడ్డికి ఏళ్ల తరబడి బంధాలు ఉన్నాయి. రాజారెడ్డి కాలం నుంచి సాయి రెడ్డి వై ఎస్ ఫ్యామిలీకి ఆడిటింగ్ సేవలు అందిస్తున్నారు. అదే క్రమంలో జగన్ కు కూడా సాయి రెడ్డి ఆడిటింగ్ సేవలు అందించారు. ఈ కారణంగానే జగన్ కేసుల్లో సాయి రెడ్డి కూడా సహా నిందితుడిగా ఉన్నారు. ఇద్దరూ ఒకేసారి జైల్లో కాలం వెళ్లదీశారు. అయితే ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయిన నేపథ్యంలో సాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడం… దానిపై జగన్ ఘాటుగా స్పందించడం… దానిపై సాయి రెడ్డి అంతకు మించిన ఘాటు వ్యాఖ్యలతో బదులు ఇవ్వడం ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది.