‘ప్రజల్లోకి ప్రభుత్వం’ నినాదంతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు..ఇలా అన్ని వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొనేలా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
తాజాగా జరిగిన సీఎల్పీ సమావేశంలో పలు విషయంపై చర్చించారు. త్వరలోనే జరగనున్న స్థానికి సంస్థల ఎన్నికలపైనా దృష్టి పెట్టారు. స్థానిక సంస్థల్లో దాదాపు క్లీన్ స్వీప్ చేసే దిశగా అడుగులు వేయాలని నిర్ణయించారు. దీనికిగాను ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుని పార్టీ తరఫున బలమైన వాయిస్ వినిపించాలని నిర్ణయించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించడం ద్వారా ప్రజలను పార్టీవైపు మళ్లించుకోవాలని ఈ సందర్భంగా సీఎం దిశానిర్దేశం చేశారు.
అదేవిధంగా కుల గణన, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణలను కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని.. ఈ క్రమంలో కొంత కష్టమైనా.. గడప గడప తిరిగి ప్రజలకు వివరించాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. ప్రతి ఒక్కరూ కష్టపడితేనే.. ఫలితం వస్తుందని.. కేవలం ఎవరో ఒకరిద్దరు కష్టపడతరులే.. మనం కూర్చుంటమంటే.. ప్రయోజనం లేదని సీఎం రేవంత్ ఈసందర్భంగా వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ప్రతి ఒక్కరూ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కృషి చేయాలని సూచించారు.
వేటు తప్పదు!
సీఎల్పీ భేటీలో పార్టీ కట్టు తప్పుతున్న ఒకరిద్దరు నాయకులపై వాడి వేడిగా చర్చ సాగింది. పార్టీని, ప్రభుత్వాన్ని కూడా ఇరుకున పెడుతున్న ఇలాంటి వారిని ఉపేక్షించరాదని.. కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్కు సభ్యులు సూచించారు. అయితే.. ఆ విషయాన్ని తనకు వదిలేయాలని.. అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి.. చర్యలు తీసుకుంటామని రేవంత్ వ్యాఖ్యానించినట్టు తెలిసింది.