వివేకా మ‌ర్ద‌ర్: డీఎస్పీ స‌హా అధికారుల‌పై కేసులు!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌కు సొంత బాబాయి.. వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసు లో తాజాగా సంచ‌లనాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో మ‌రో న‌లుగురిపై పోలీసులు కేసులు న‌మోదు చేశారు. వీరిలో డీఎస్పీ స్థాయి అధికారి నుంచి సీఐ వ‌ర‌కు ఉన్నారు. ఈ ప‌రిణామాల‌తో మ‌రోసారి వివేకా కేసు సంచ‌ల‌నంగా మారింది. 2019 ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగిన వివేకా దారుణ హ‌త్య కేసులో ఆయ‌న డ్రైవ‌ర్ ద‌స్త‌గిరి అప్రూవ‌ర్‌గా మారిన విష‌యం తెలిసిందే.

అయితే.. తాను బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత‌.. జైల్లో ఉన్న‌ప్పుడు కూడా. వేధించారంటూ కొంద‌రిపై ద‌స్త‌గిరి ఫిర్యాదు చేశారు. కానీ, వైసీపీ హ‌యాంలో ఎవ‌రూ ఈయ‌న ఫిర్యాదుల‌ను స్వీక‌రించ‌లేదు. పైగా అప్రూవ‌ర్‌గా మారిన ద‌స్త‌గిరిని త‌క్ష‌ణ‌మే జైలుకు పంపించాల‌ని కూడా ప్ర‌భుత్వం త‌ర‌ఫున న్యాయ‌వాదులు వాదించా రు. దీంతో అప్ప‌ట్లో త‌న‌కు న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని ద‌స్త‌గిరి మీడియా ముందుకు వ‌చ్చిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి.

ఇక‌, ఇప్పుడు తాజాగా కూట‌మి స‌ర్కారు హ‌యాంలో ద‌స్త‌గిరి మ‌రోసారి పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. దీంతో తాజాగా న‌లుగురిపై కేసులు న‌మోద‌య్యాయి. ద‌స్త‌గిరిని బెదిరించ‌డం.. చంపేస్తామ‌ని హెచ్చ‌రించ డం, వేధింపుల‌కు గురి చేయ‌డం వంటి కార‌ణాల‌తో సెక్ష‌న్లు న‌మోదు చేశారు. ఆ వెంట‌నే పులివెందుల పోలీసులు కేసులు న‌మోదు చేశారు. దీంతో గ‌త మూడేళ్లుగా తాను చేస్తున్న పోరాటం ఫ‌లించింద‌ని ద‌స్త‌గిరి పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

కేసులు వీరిపైనే..

  • వివేకా దారుణ హ‌త్య కేసులో కీల‌క నిందితుడు దేవిరెడ్డి శివ‌శంక‌ర‌రెడ్డి కుమారుడు డాక్ట‌ర్ చైత‌న్య రెడ్డిపై కేసు పెట్టారు. ఈయ‌న వైద్యుడిగా ఉండి.. త‌ర‌చుగా జైలుకు వ‌చ్చి బెదిరించిన‌ట్టు ఫిర్యాదులు ఉంది.
  • జ‌మ్మ‌ల‌మ‌డుగు డీఎస్పీ నాగ‌రాజుపైనా కేసు న‌మోదైంది. ఈయ‌న బెదిరించార‌ని.. ఫిర్యాదు.
  • సీఐ ఈశ్వ‌రయ్య‌, క‌డ‌ప జిల్లా సూప‌రింటెండెంట్‌గా ప‌నిచేసిన ప్ర‌శాష్‌ల‌పై కేసులు న‌మోద‌య్యాయి.