టీటీడీలో అన్యమత ఉద్యోగుల బదిలీ

జగన్ హయాంలో తిరుపతి, తిరుమల ప్రతిష్ట మసకబారిందని, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డులో అవకతవకలు జరిగాయని తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. తిరుమలలో అన్యమత ప్రచారం ఆరోపణలు, ఆర్టీసీ టికెట్లపై అన్యమత ప్రచారం, టీటీడీ భూముల వేలంపాటకు ప్రభుత్వం పూనుకోవడం, సప్తగిరి మాసపత్రిక వ్యవహారం, తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ రోడ్డు పక్కన ఉన్న గోడలపై హిందూ దేవతల బొమ్మల స్థానంలో వైసీపీ రంగులు..చివరగా తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం ఆరోపణలతో కలియుగ దైవం వెంకన్న ప్రతిష్టను జగన్ సర్కార్ దిగజార్చిందని ఆరోపణలు వచ్చాయి.

అయితే, ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల వెంకన్న ప్రతిష్టను ఇనుమడింపజేసేలా ఎన్నో సంస్కరణలు, చర్యలు చేపట్టింది. టీటీడీలో ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న కొందరు అన్యమత ప్రచారం చేస్తున్న వైనంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే 18 మంది ఉద్యోగులను బదిలీ చేసింది. అన్యమత ఉద్యోగస్తులు కొందరు అన్యమత ప్రచారం చేస్తున్నారని, మరికొందరు ఉద్యోగుల అండ చూసుకొని తిరుమల కొండపై మాంసాహారం, గంజాయి, మందు విచ్చలవిడిగా దొరుకుతున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు.

ఆ క్రమంలోనే విచారణ జరిపిన టీటీడీ అన్యమత ప్రచారం చేస్తున్న 69 మందిని గుర్తించింది. అందులో టీటీడీ రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆ 69 మందిలో 18 మంది ఉద్యోగులను బదిలీ చేస్తున్నట్లు తాజాగా టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ మహిళ‌ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ అయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్, వివిధ విద్యా సంస్థల్లో లెక్చరర్లు, హాస్టల్ వార్డెన్లు తదితరులు ఉన్నారు. మరో 300 మంది అన్యమతస్తులు వివిధ విభాగాల్లో టీటీడీలో విధులు నిర్వర్తిస్తున్నారు.

టీటీడీలో, తిరుమలలో పలు చోట్ల పనిచేస్తున్న అన్యమత ఉద్యోగస్తులను వేరే స్థానాలకు బదిలీ చేయాలని చాలా రోజులుగా భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 18 మంది బదిలీతో తొలి అడుగు పడినట్లు కనిపిస్తోంది. భవిష్యత్తులో అన్యమతుస్తులైన ఉద్యోగులందరినీ బదిలీ చేసే అవకాశముందని తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రభుత్వం, టీటీడీ తాజా నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.