చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి… ఉమ్మడి కడప జిల్లాలోని కీలక నియోజకవర్గం జమ్లమడుగు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేత. ఆదిలో కాంగ్రెస్, వైసీపీల్లో కొనసాగిన ఆయన ఆ తర్వాత టీడీపీలో కూడా కొనసాగారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న రెడ్డి… మొన్నటి ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి బీజేపీ అభ్యర్థిగానే విజయం సాదించారు. దాదాపుగా అన్ని పార్టీల్లోనూ అడుగులు పెట్టిన ఈయనకు… ఆయా పార్టీలతో మంచి సంబంధాలే ఉంటాయిలే అనుకుంటాం. అయితే ఏ ఒక్క పార్టీకి చెందిన నేతలతోనూ ఆయనకు పొసగడం లేదు. వెరసి ఇప్పుడు ఈ రెడ్డిగారు ఏకాకిగా మిగిలిపోయారు.
మొన్నటికి మొన్న రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు చెందిన ప్లై యాష్ తరలింపు విషయంలో తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ గా ఉన్న టీడీపీ సీనియర్ నేతతో ఓ రేంజిలో వివాదం చెలరేగింది. ఇరువురు నేతలు డీ అంటే డీ అన్నట్లుగా సాగగా… చివరకు చంద్రబాబు దూతలు వచ్చి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడేలా చేశారు. ఈ వివాదంలో ఆదిపై జేసీదే పైచేయిగా నిలిచినట్టు సమాచారం. వాస్తవానికి ఆర్టీపీపీ జమ్మలమడుగు పరిధిలో ఉంది. ఈ లెక్కన దానికి సంబంధించిన వ్యవహారాల్లో ఆది వాదన నెగ్గి తీరాలి. అయినా కూడా పొరుగు జిల్లా నేత ఆదికి షాకిచ్చారు. పలితంగా ఆది పరువు పోయినట్టైందట.
తాజాగా జమ్మలమడుగు క్లబ్ లో అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ అనకాపల్లి ఎంపీగా ఉన్న సీఎం రమేశ్ నేరుగా కడప జిల్లా కలెక్టర్, ఎస్పీలకే ఫిర్యాదు చేశారు. అనకాపల్లి ఎంపీగా గెలిచిన సీఎం రమేశ్ స్వస్థలం కడప జిల్లానే. ఈ క్రమంలోనే తన సొంత జిల్లాకు చెందిన వ్యవహారం కాబట్టి… జమ్మలమడుగు క్లబ్ పై ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన అదికార యంత్రాంగం రమేశ్ ఫిర్యాదు నిజమేనని నిర్ధారించి క్లబ్ ను మూసేశారు. ఈ విషయంలో ఆది నారాయణ రెడ్డి వాదనను అధికారులు అస్సలు పరిగణనలోకి తీసుకోలేదట. ఇదిలా ఉంటే… ఆది, రమేశ్ ఇద్దరూ ఇప్పుడు బీజేపీలోనే ఉన్నారు. అంటే నిన్న మిత్రపక్షం నేత చేతిలో షాక్ తగిలితే… తాజాగా ఆదికి సొంత పార్టీ నేత నుంచే షాక్ తప్పలేదట.