సినిమాల్లో విలనీ… రియల్ లైఫ్ లో సిసలైన నాయకుడిగా సాగుతున్న ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ సోమవారం నవ్యాంద్ర నూతన రాజదాని అమరావతి వచ్చారు. ప్రపంచ దేశాలను హడలెత్తించడంతో పాటుగా కోట్లాది మంది జీవితాలనే సమూలంగా మార్చేసిన క్లిష్ట పరిస్థితుల్లో ఆపదలో ఉన్న వారికి సూద్ దేవుడిలా కనిపించారు. మార్గమధ్యంలో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చేందుకు తన శక్తికి మించి సాయం చేసిన సూద్… ఆ సేవలో తాను ఎంతగానో తృప్తి పొందానని చెప్పారు. కరోనా టైంలో సేవలతో దేశవ్యాప్తంగా సూద్ కు మంచి పేరు వచ్చింది.
ఎంత సేవ చేసినా… ఎన్ని సినిమాల్లో నటించినా… ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చినా…రాజకీయాలకు ఆమడ దూరం ఉండే సోనూ సూద్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విషయంలో మాత్రం ఎందుకనో గానీ చాలా ఆప్యాయంగా నడుచుకుంటారు. ఏపీకి ఇటీవలే చంద్రబాబు మరోమారు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాస్తంత వీలు చూసుకుని అమరావతిలో వాలిపోయిన సూద్… సచివాలయంలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి 4 అంబులెన్స్ లను ఇస్తున్నట్లు చెప్పిన సూద్… వాటిని చంద్రబాబుు అప్పగించారు. ఏపీకి తన వంతుగా తనకు చేతనైన సాయం చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని సూద్ తెలిపారు.
ఆ తర్వాత బయటకు వచ్చిన సూద్… చంద్రబాబును కలిసేందుకే అమరావతి వచ్చానని పేర్కొన్నారు. చంద్రబాబు విధానాలంటే తనకు ఇష్టమని తెలిపారు. తెలుగు ప్రజలు అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందన్నారు. అందుకే తెలుగు ప్రజలకు ఏదో ొకటి చేయాలన్న ఉద్దేశ్యంతోనే అంబులెన్స్ లను రాష్ట్ర ప్రభుత్వానికి అందించానన్నారు. రాజకీయాలు అంటే తనకు ఇంటరెస్ట్ లేదని తెలిపారు. అయితే ఏపీ అభివృద్ధికి తన వంతుగా సాయం చేసేందుకు మాత్రం సిద్ధంగా ఉన్నానన్నారు. అందులో భాగంగా ఏపీకి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయమన్నా చేస్తానని చెప్పారు. కరోనా సమయంలో తాను చేసిన సాయాన్ని ఏ నాయకుడి వద్ద కూడా చెప్పుకోని సూద్… ఒక్క చంద్రబాబు వద్ద మాత్రమే చెప్పుకున్నారు. ఆ సందర్భంగా చంద్రబాబు, సూద్ ల భేటీ దేశవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకుంది.