ఆ సందర్భంలో జగన్ ను డిస్ క్వాలిఫై చేయొచ్చు: రఘురామ

వైసీపీ హయాంలో ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామపై కక్షగట్టి టార్చర్ పెట్టిన ఆనాటి జగన్ ప్రభుత్వం వైఖరి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆ కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ వేగవంతమైంది. ఈ క్రమంలోనే తాజాగా ఆనాడు కస్టడీలో జరిగిన టార్చర్ గురించి రఘురామ తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రౌడీ ఫెలో సినిమాలో కొట్టినట్లు తనను కొట్టారని రఘురామ షాకింగ్ విషయాలు వెల్లడించారు.

అదృష్టం బాగుండి బతికిపోయానని అన్నారు. ఆ సినిమాలో ఒకడిని కస్టడీలో సీఐ కొడుతుంటే చనిపోతాడని, కానీ, ఆ చనిపోయిన వాడిని ఇంకా బతికి ఉన్నట్లు చూపించాలని, ఫిట్స్ వచ్చినట్లు చూపించి ఆస్పత్రికి తీసుకువెళ్లి అక్కడ ఫిట్స్ తో చనిపోయినట్లు చూపించమని చెబుతారని గుర్తు చేశారు. ఇక, ఈ కస్టోడియల్ టార్చర్ ఎపిసోడ్ లో పీవీ సునీల్ పాత్రపై రఘురామ కీలక వ్యాఖ్యలు చేశఆరు.

సునీల్ కుమార్ అతి తెలివి ఉపయోగించి యూట్యూబ్‌లో ఉన్న వీడియోలు డిలీట్ చేయించారని గుర్తు చేశారు. ప్రభుత్వానికి తాను ఒక బాధితుడిగా ఫిర్యాదు చేశానని అన్నారు. సునీల్ కుమార్‌ను ఎప్పుడు సస్పెండ్ చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని అడిగానని తెలిపారు. తన కస్టోడియల్ టార్చర్‌పై పోరాటం ఆగదని చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని నమ్ముతున్నానని, దోషులకు శిక్ష పడుతుందనే సంపూర్ణ విశ్వాసం ఉందని అన్నారు.

ఇక, వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, తన మనోభావాలు ఏంటో సభలో తెలియజేయాలని చెప్పారు. ప్రతిపక్ష హోదా స్పీకర్, సీఎం ఇవ్వరని, ప్రజలు ఇస్తారని చెప్పారు. ఏ ఎమ్మెల్యే అయినా సెలవు అడగకుండా 60 రోజుల పాటు సభకు రాకుంటే అనర్హత వేటు పడుతుందని అన్నారు. అప్పుడు పులివెందులకు ఉప ఎన్నికలు వస్తాయని రఘురామ చెప్పారు.