ఏపీలోని పలు పురపాలికల్లో ఖాళీగా ఉన్న పదవుల భర్తీ నేపథ్యంలో తిరుపతిలో ఆదివారం నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ అధికారంలో ఉండగా జరిగిన ఎన్నికలు కావడంతో తిరుపతి కార్పొరేషన్ ఆ పార్టీ ఖాతలోకే వెళ్లిపోయింది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, తిరుపతి ఎమ్మెల్యేగా జనసేనకు చెందిన జంగాలపల్లి శ్రీనివాసులు గెలవడంతో పరిస్థితి తారుమారయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ఖాళీగా ఉన్న డిప్యూటీ మేయర్ ఎన్నికకు రంగం సిద్ధంగా కాగా… వైసీపీ, జనసేనల మధ్య అగ్గి రాజుకుంది.
కార్పొరేషన్ లో వైసీపీకి మెజారిటీ ఉన్న కారణంగా డిప్యూటీ మేయర్ ఆ పార్టీకే దక్కుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకో, జనేసనలోకో జంప్ కొట్టారు. ఫలితంగా సోమవారం మధ్యాహ్నం ఎన్నిక జరిగేదాకా డిప్యూటీ మేయర్ పదవి ఎవరికి దక్కుతుందన్నది సస్పెన్స్ గానే మారిపోయింది. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి ఆ పోస్టుకు శేఖర్ రెడ్డి అనే కార్పొరేటర్ పేరును ఎంపిక చేయగానే… ఆయన అక్రమంగా నిర్మిస్తున్న ఇంటిని అధికారులు కూల్చేశారు. తాజాగా తమ వైపునకు తిరిగిన పలువురు వైసీపీ కార్పొరేటర్లను ఎమ్మెల్యే శ్రీనివాసులు కుమారుడు మదన్ చిత్తూరులోని తమ నివాసం, హోటల్ కు తరలించారన్న సమాచారంతో… తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి రంగంలోకి దిగారు.
తిరుపతి నుంచి చిత్తూరుకు దాదాపుగా 60 కిలో మీటర్ల దూరం ఉంటుంది. చిత్తూరులో వైసీపీ కార్పొరేటర్లను నిర్బంధించారంటూ ఆయన తిరుపతి నుంచి చిత్తూరుకు తరలివెళ్లారు. వైసీపీ కార్పొరేటర్లు ఉన్నారని బావించిన హోటల్ కు చేరుకున్నారు. అప్పటికే అక్కడ మదన్ ఉన్నారు. ఈ సందర్బంగా వైసీపీ కార్పొరేటర్లను వదిలేయాలని అభినయ్ కోరగా… తాము ఎవరినీ నిర్బంధించలేదని మదన్ బదులిచ్చారు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగ్గా… కార్యక్ర్తలు పరస్పరం తోపులాటకు దిగారు.
ఇది న్యాయం కాదని అభినయ్ అంటే… మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఏమిటంటూ మదన్ నిలదీశారు. వెరసి అక్కడ ుద్రిక్త పరిస్థితులు నెలకొనగా… సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే యత్నం చేశారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తయ్యే దాకా ఈ టెన్షన్ వాతావరణం కొనసాగేలానే ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.