ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీని కూటమి పార్టీలు వాయించేస్తున్నాయి. అవకాశం ఉన్న చోటే కాదు.. అవకాశం వెతికి మరీ వైసీపీని ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తున్నాయి. ప్రధానంగా బీజేపీ ఎలా ఉన్నప్పటికీ.. టీడీపీ, జనసేనలు మాత్రం తమదైన పంథాతోనే ముందుకు సాగుతున్నాయి. ఆది నుంచి వైసీపీ నాయకుడు.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వ్యతిరేకించే టీడీపీ.. జనసేనలు.. తాజాగా టార్గెట్ చేశాయి. ఈ క్రమంలోనే అటవీ భూముల్లో ఇంటి నిర్మాణం, రోడ్డు నిర్మాణాలపై విచారణకు ఆదేశించాయి.
అయితే.. విషయం అక్కడితో అయిపోలేదు. పెద్దిరెడ్డితోపాటు వైసీపీని కూడా టార్గెట్ చేస్తూ.. జనసేన కీలక వ్యూహం పన్నింది. పెద్దిరెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో జనసేన జెండాను ఎగరేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఫిబ్రవరి 3ను ముహూర్తంగా పేర్కొంది. ఇప్పటి వరకు పుంగనూరులో వేరే జెండా ఎగరాలంటేనే ఆలోచించే పరిస్థితి నుంచి ఇప్పుడు జనసేన ఏకంగా 50 వేల నుంచి లక్ష మందితో సభను నిర్వహించనుంది.
దీనికి యువతను పెద్ద ఎత్తున సమీకరించనుంది. ముఖ్యంగా మెగా అభిమానులను పెద్ద సంఖ్యలో తరలించేందుకు పక్కా వ్యూహం రెడీ చేసుకున్నట్టు తెలిసింది. మొత్తంగా పుంగనూరులో జనసేన రాజకీయా లు స్టార్ట్ అవుతున్నాయి. అంటే.. పెద్దిరెడ్డి ఇలాకాలో జనసేన పుంజుకునే వ్యూహానికి పునాదులు పడుతు న్నాయన్నమాట. ఆదివారం నిర్వహించే సభను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీమలో ఉన్న నాయకులను అందరినీ రావాలంటూ ఆహ్వానాలు పంపించింది.
ఇక, వైసీపీకి ఎదురైన మరో పెద్ద దెబ్బ.. టీడీపీ నుంచే వస్తోంది. కడపలో మహానాడును నిర్వహించాలన్నది ఆ పార్టీ వ్యూహం. ఇదే జరిగితే.. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లాలో టీడీపీ దూకుడు మరింత పెరగడం ఖాయం. ఇలా.. ఇరు పార్టీలు కూడా వైసీపీకి ఊపిరి ఆడకుండా చేస్తున్నాయన్నది తాజాగా రాజకీయ చర్చకు వచ్చిన విషయం. అటు జనసేన, ఇటు టీడీపీ దూకుడుతో వైసీపీకి రెండు పక్కలా వాచిపోతోందని అంటున్నారు. ఇప్పటికే ముఖ్య నాయకులు వెళ్లిపోవడం.. ఉన్నవారు కూడా కేసుల్లో ఇరుక్కోవడంతో వైసీపీకి రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితి ఎదురు కానుందని అంటున్నారు.