బాబుకు ఢిల్లీ లో తెలుగు వారే టార్గెట్

మాట‌ల మాంత్రికుడు.. తెలుగు వారు ఎక్క‌డున్నా వారిని త‌న‌వైపు తిప్పుకోగ‌ల నేర్పు, ఓర్పు ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.. సీఎం చంద్ర‌బాబు. ఆయ‌న ఏ విష‌యంపైనైనా అన‌ర్గ‌ళంగా మాట్లాడగలరు. ఇక‌, పాల‌న‌, ఐటీ రంగాల గురించి అయితే మ‌రీ ఎక్కువ‌. మైకు ప‌ట్టుకుంటే వ‌దిలి పెట్ట‌ర‌న్న నానుడి ని కూడా చంద్ర‌బాబు సొంతం చేసుకున్నారు. అందుకే ఆయ‌న స్టార్ క్యాంపెయిన‌ర్ అయ్యారు. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏపీలో తీవ్ర‌స్థాయిలో ప్ర‌చారం చేసిన బాబు.. ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకోగ‌లిగారు.

ఇక‌, ఇప్పుడు మ‌రో అవ‌కాశం వ‌చ్చింది. కూట‌మి మిత్ర‌ప‌క్ష పార్టీ కోసం.. చంద్ర‌బాబు మ‌రోసారి మైకు ప‌ట్టుకోనున్నారు. ప్ర‌చార ర‌థంపై ఆయ‌న ప్ర‌జ‌ల‌ను ఓట్లు అభ్య‌ర్థించ‌నున్నారు. దీంతో చంద్ర‌బాబు ప్ర‌చార శైలి.. వ‌చ్చే ఓట్ల‌పై బీజేపీ నాయ‌కులు లెక్క‌లు వేసుకుంటున్నారు. ఫిబ్ర‌వ‌రి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో అక్క‌డ బీజేపీ త‌ర‌ఫున ప్ర‌చారం చేసేందుకు స్టార్ క్యాంపెయిన‌ర్లుగా కొంద‌రు అనుకూల సీఎంల‌ను బీజేపీ పెద్ద‌లు రెడీ చేసుకున్నారు.

దేశ‌రాజ‌ధాని అంటేనే అనేక ప్రాంతాల నుంచి వ‌చ్చి స్థిర‌ప‌డిన వారు ఉంటారు. దీంతో ఆయా రాష్ట్రాల నేత‌ల‌ను క‌లిస్తే.. వారి భావాల్లో మార్పు వ‌స్తుంద‌న్నది రాజ‌కీయ నేత‌లు భావించే మాట‌. ఈ నేప‌థ్యంలోనే ఢిల్లీలోని ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో తెలుగు వారు ఎక్కువ‌గా ఉండ‌డంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారానికి బీజేపీ చంద్ర‌బాబును ఒప్పించింది. శ‌నివారం చంద్ర‌బాబు ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి.. అక్క‌డే బ‌స చేస్తారు. ఆదివారం తెలుగు వారు ఎక్కువ‌గా ఉన్న ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో సుడిగాలి ప‌ర్య‌ట‌న చేస్తార‌ని బీజేపీ నేత‌లు తెలిపారు.

ఎన్ని ఓట్లు..

ఢిల్లీలో తెలుగు వారి ఓట్లు సుమారు 6 ల‌క్ష‌ల పైచిలుకు ఉన్న‌ట్టు స‌మాచారం. ప్రాంతాల వారీగా చూడా లంటే.. హైద‌రాబాద్‌కు చెందిన వారే ఎక్కువ‌. అయితే.. వీరంతా కూడా చంద్ర‌బాబు అంటే ప్రాణం పెడ‌తారు అనే ధీమాతోనే బీజేపీ ఆయ‌న‌ను ప్ర‌త్యేకంగా ఆహ్వానించింది. చంద్ర‌బాబు హ‌యాంలో ఐటీలో శిక్ష‌ణ పొందిన వారు.. ఇప్పుడు ఢిల్లీలో ఉద్యోగాలు చేస్తున్నారు. దీంతో త‌న‌దైన శైలిలో వారిని ఆక‌ర్షించి.. బీజేపీ వైపు మొగ్గు చూపేలా చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించాల్సి ఉంటుంది.