జగన్ తో కానిది… బాబుతో సాకారం

రాయలసీమ ముఖద్వారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు.. కర్నూలును న్యాయ రాజధానిగా తీర్చిదిద్దుతాం… ఇవీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాయలసీమ ప్రజలకు ఇచ్చిన భారీ వాగ్దానం. జగన్ మాటలను నమ్మిన సీమ జనం 2019 ఎన్నికల్లో తమ ఓట్లన్నీ వైసీపీకే గుద్దేశారు. ఫలితంగా జగన్ సీఎం అయ్యారు. ఐదేళ్ల పాటు దిలాసాగా కాలం వెళ్లదీశారు. కర్నూలుకు హైకోర్టు ఏదీ అంటే.. అదిగో, ఇదిగో అంటూ చెప్పారే తప్పించి… ఆ దిశగా నిర్మాణాత్మక అడుగులు అయితే వేయలేకపోయారు. జగన్ తీరును అర్థం చేసుకున్న సీమ జనం… 2024 ఎన్నికల్లో తమ పవరేమిటో చూపించారు. ఇంకేముంది జగన్ కు కనీసం ప్రదాన ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కలేదు.

సీన్ కట్ చేస్తే… ఇప్పుడు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు వంతు వచ్చింది. అమరావతిలో రాజధానిని అభివృద్ధి చేస్తూనే… రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనూ ప్రగతి పథంలో నడిపిస్తానని చంద్రబాబు చెప్పారు. సీమజనం కోరినట్లుగా హైకోర్టును అయితే కర్నూలులో ఏర్పాటు చేయలేనని చెప్పిన చంద్రబాబు… హైకోర్టు బెంచ్ ను ఏర్పాటు చేస్తానని చెప్పారు. బాబు మాటను నమ్మిన జనం కూటమికి ఓట్లు గుద్దేశారు. ఫలితంగా 94 శాతం స్ట్రైక్ రేట్ తో కూటమి విజయం సాధించింది. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. మరి హైకోర్టు బెంచ్ విషయంలో ఏమైనా అడుగులు పడ్డాయా? అంటే…అడుగులు కాదు… ఈ దిశగా కూటమి సర్కారు పరుగే పెడుతోంది.

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే దిశగా గురువారం కూటమి సర్కారు ఏకంగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా హైకోర్టు బెంచ్ కు సరిపడ భవన సముదాయాలను పరిశీలించాలని కూడా జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో వేగంగా కదిలిన జిల్లా యంత్రాంగం… నగరంలోని ఏపీఆర్సీ భవనంతో పాటుగా ఏపీఎస్పీ 2వ బెటాలియన్ పరిధిలోని పలు భవనాలను పరిశీలించింది. ఈ పరిశీలనకు సంబంధించిన నివేదికను జిల్లా అధికారులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. ఈ నివేదికను పరిశీలించిన తర్వాత కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ఓ స్పష్టమైన ప్రకటనను విడుదల చేయనుంది. అంటే… జగన్ కు చేతకాని పనిని చంద్రబాబు చేసి చూపెడుతున్నారన్న మాట.