కేటీఆర్ ఐడియాను బీజేపీ హైజాక్ చేసిందా?

క‌రోనా కారణంగా దేశంలోని అన్ని రంగాలు ప్ర‌భావితం అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి పుట్టుకకు మూల కార‌ణంగా విమ‌ర్శ‌లు ఎదుర్కుంటున్న చైనాను ప్ర‌పంచంలోని అన్ని దేశాలు టార్గెట్ చేస్తున్నాయి. ఇందులో కొన్ని దేశాలు త‌మ పెట్టు‌బ‌డుల‌ను వెన‌క్కి తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించేశాయి.

చైనా నుంచి ఇలా కంపెనీలు ఎగ్జిట్ అయ్యే ప్లాన్‌ను భార‌త్ కైవ‌సం చేసుకుంనేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. అయితే, ఈ క్ర‌మంలో తెలం‌గాణ ఐటీ వాఖ మంత్రి కేటీఆర్ కీల‌క ప్ర‌తిపాద‌న చేశారు. అయితే, దీన్ని బీజేపీ పాలిత స‌ర్కారు క్యాష్ చేసుకు‌నే అవ‌కాశం క‌నిపిస్తోంది.

అన్ని రాష్ర్టాల ఐటీ మంత్రులతో కేంద్ర ఐటీ, న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి కరోనా వైరస్‌ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు, ఐటీ పరిశ్రమపై కొవిడ్‌-19 ప్రభావం, కొత్త టెక్నాలజీ వినియోగం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు.

ఈ సంద‌ర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కీల‌క ప్ర‌తిపాద‌న పెట్టారు. చైనా నుంచి తమ తయారీ యూనిట్లను ఇతర దేశాలకు తరలిస్తున్నట్టు జపాన్‌ లాంటి దేశాలు ఇప్పటికే బహిరంగంగా ప్రకటించిన విషయాన్ని మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా గుర్తుచేస్తూ.. ఇలాంటి పరిశ్రమలను, ముఖ్యంగా ఐటీ సంబంధిత ఎలక్ట్రానిక్‌ పరిశ్రమలను భారత్‌కు రప్పించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. అలా చేయగలిగితే దేశంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయన్నారు.

అయితే, ఈ ప్ర‌క‌ట‌న చేసిన మ‌రుస‌టి రోజే బీజేపీ పాలిత రాష్ట్రమై ఉత్త‌రప్ర‌దేశ్ మంత్రి సిద్ధార్థ‌నాథ్ సింగ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. చైనా నుంచి వెళ్లిపోవాల‌ని చూస్తున్న దాదాపు వంద‌ కంపెనీలు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో త‌మ శాఖ‌లను నెల‌కొల్పేందుకు సిద్ధంగా ఉన్నాయ‌ని తెలిపారు. చైనాలో అమెరికా పెద్ద‌మొత్తంలో పెట్టుబ‌డులు పెట్టింది. ఇప్పుడు చైనా నుంచి వెళ్లిపోతున్న ఆ పెట్టుబ‌డుల‌ను భార‌త్‌లో ముఖ్యంగా యూపీలో పెట్టేలా చేయాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ, ముఖ్య‌మంత్రి ఆధిత్య‌నాథ్ కోరుకుంటున్నారు.

మంగ‌ళ‌వారం ఓ వెబినార్ ద్వారా వంద కంపెనీల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించాం అని మంత్రి వెల్ల‌డించారు. దీంతో, ఐడియా ఇచ్చింది కేటీఆర్‌ అయితే… దాన్ని బీజేపీ పాలిత రాష్ట్రమైన యూపీ క్యాష్ చేసుకుంద‌ని అంటున్నారు.