చేతులు కాలాక‌.. జ‌గ‌న్ చ‌ర్య‌లు.. చోద్యం కాదా!

చేతులు కాలాక‌.. ఆకులు ప‌ట్టుకున్న చందంగా వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. పార్టీలో ఎవ‌రైనా హ‌ద్దు దాటితే.. వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాలి. లేక‌పోతే.. హెచ్చ‌రించి లైన్లో పెట్టుకోవాలి. కానీ, అంతా అయిపోయిన త‌ర్వాత‌.. చ‌ర్య‌లు తీసుకుంటే ఏంటి ప్ర‌యోజ‌నం అని ప్ర‌శ్నిస్తున్నారు. తాజాగా వైసీపీ నాయ‌కుడు, న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుపై చ‌ర్య‌ల‌కు జ‌గ‌న్ పూనుకొన్నార‌నేవార్త‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న‌ను పార్టీ నుంచి బ‌హిష్క‌రించేందుకురంగం సిద్ధం చేస్తున్న‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు లీకులు ఇచ్చాయి.

ర‌ఘురామ‌రాజును బ‌హిష్క‌రించ‌డంపై పార్టీలో వ్య‌తిరేక‌త లేదు. రెండో మాట కూడాలేదు. అయితే, ఎప్పుడో తీసుకోవాల్సిన నిర్ణ‌యం ఇప్పుడు తీసుకుంటున్నార‌నే విష‌యంలోనే పార్టీలో భిన్నాభిప్రా యాలు వ‌స్తున్నాయి. “ఆయ‌న‌పై ఎప్పుడో చ‌ర్య‌లు తీసుకోమ‌ని మేం చెప్పాం. అప్ప‌ట్లోనే వేటు వేసి ఉంటే.. ఆయ‌న పూర్తిగా మైన‌స్ అయ్యేవాడు. మాన‌సికంగా ఆయ‌న డిఫెన్స్‌లో ప‌డేవారు. కానీ, మా వాళ్లు విన‌లేదు.దీంతో ఎంపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించాడు. త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నాడు. రాజ‌కీయాల్లో ఇలాంటి నాయ‌కుడు అవ‌స‌రం అని అని అనిపించేలా అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించాడు. పైగా రాజ‌ధాని విష‌యంలో ఆయ‌న తీసుకున్న లైన్ కూడా అంద‌రికీ న‌చ్చింది. ఇప్పుడు ఆయ‌న‌పై వేటు వేస్తే.. ప‌నిగ‌ట్టుకుని సింప‌తీని ఆయ‌న‌కు ఇచ్చిన‌ట్టే” అని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన కీల‌క నాయ‌కుడు ఒక‌రు వ్యాఖ్యానించారు.

ఇక‌, ఇదే అభిప్రాయాన్ని కృష్ణా, గుంటూరు జిల్లాల‌కు చెందిన వైసీపీ నాయ‌కులు వ్య‌క్త ప‌రుస్తున్నారు. “ర‌ఘురామ రాజుతో మ‌న‌కు ప్ర‌యోజ‌నం లేద‌ని తెలిసిన‌ప్పుడు వెంట‌నే వేటు వేసి ఉంటే.. ఆయ‌న వ్యాఖ్య‌ల‌కు ప్రాధాన్యం ఉండేది కాదు. కానీ, ఆయ‌నపై అప్ప‌ట్లో నేరుగా వేటు వేయ‌లేదు. దీంతో ఆయ‌న వైసీపీ నాయ‌కుడిగానే ప్ర‌జ‌లు భావించారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు కూడా అంతే రేంజ్‌లో పాపుల‌ర్ అయ్యాయి. ఇప్పుడు వేటు వేసినా.. ఆయ‌న‌కేం నష్టం లేదు.

ప్ర‌భుత్వ లొసుగులు బ‌య‌ట పెడుతున్నందుకు.. న‌న్ను బ‌హిష్క‌రించారంటూ.. ఆయ‌న మ‌రో వాద‌న తీసుకువ‌చ్చి.. మ‌రింత రెచ్చిపోతారు. బ‌హిష్క‌రించ‌డం కాకుండా ఇంకేదైనా మార్గం ఉందేమో.. ఆలోచించుకోవాలి” అని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మొత్తానికి జ‌గ‌న్ తీసుకుంటార‌ని భావిస్తున్న నిర్న‌యంపై చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న చందంగా ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్తం కావ‌డం గ‌మ‌నార్హం.